ఆ రీమేక్‌లో వెంకీ.. డౌటే?

ఇండియాలో వివిధ భాషల్లో ఒకే కథాంశంతో తెరకెక్కి సూపర్ సక్సెస్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ అగ్ర భాగాన నిలుస్తుంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా జీతు జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. రూ.30 కోట్ల లోపు మార్కెట్ ఉన్న మళయాల సినిమా స్థాయిని దృశ్యం ఏకంగా రూ.50 కోట్లు దాటించేసింది. అక్కడ ఆ స్థాయి గ్రాస్ సాధించిన తొలి చిత్రం అదే.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేస్తే అన్ని చోట్లా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కథను మొదలుపెట్టి కొత్త కథను చెప్పబోతున్నారిందులో. అంటే ఇది పక్కా సీక్వెల్ అన్నమాట. మొదలైన నెలన్నరలోనే ఈ సినిమాను పూర్తి చేశారు. త్వరలోనే విడుదల కాబోతోంది.

ఐతే ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఐతే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లినపుడు అందరి దృష్టీ సీక్వెల్ మీద నిలిచింది. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేసి మంచి ఫలితాన్నందుకున్న వెంకటేష్ సీక్వెల్‌ను కూడా రీమేక్ చేయొచ్చని అనుకున్నారు. ఆయనకు రీమేక్‌ల్లో మంచి సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ‘దృశ్యం-2’ ఆడితే.. దాన్ని కూడా రీమేక్ చేస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సందేహాలు కలుగుతున్నాయి.

ఎందుకంటే ‘దృశ్యం-2’ నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. మలయాళ ‘దృశ్యం’ వచ్చినపుడు ఓటీటీల సందడి లేదు. పైగా మలయాళ సినిమాల మీద మనోళ్ల దృష్టి తక్కువే. కానీ ఇప్పుడు ఆ భాషా చిత్రాలకు బాగా అలవాటు పడ్డారు. అమేజాన్ ప్రైమ్ కూడా బాగా అలవాటైపోయింది. ‘దృశ్యం’కు సీక్వెల్ అనగానే తెలుగు వాళ్లు ఆ చిత్రాన్ని ఓటీటీలో పెద్ద ఎత్తున చూసే అవకాశముంది. ఇలా అందరూ చూసేశాక, కథేంటో తెలిసిపోయాక రీమేక్ చేసి పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి ‘దృశ్యం-2’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ దీన్ని వెంకీ రీమేక్ చేసే అవకాశాలు లేనట్లే.