ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే రావాల్సిన ఈ చిత్రాన్ని గల్ఫ్ దేశాల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా మే 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తేదీకే పక్కాగా సినిమా రిలీజ్ కాబోతోంది. ఐతే ఈ చిత్రం మేకింగ్ దశలో ఉండగా.. తెలుగు రీమేక్ మీద రకరకాల వార్తలు వచ్చాయి.

దృశ్యం, దృశ్యం-2 చిత్రాలను రీమేక్ చేసిన విక్టరీ వెంకటేష్.. దృశ్యం-3లో కూడా నటిస్తాడని, నటించడని.. ఇలా సందిగ్ధత నడిచింది. చివరగా వెంకీ ‘దృశ్యం-3’ని పక్కన పెట్టినట్లే వార్తలు వచ్చాయి. ఐతే ఆ విషయం అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ‘దృశ్యం-2’ వచ్చినపుడు రీమేక్ గురించి చర్చ లేదు. కానీ తర్వాత వెంకీ దాన్ని టేకప్ చేశాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ ఇప్పుడు ఆ సందేహాలకు తెరపడింది. రాంబాబు ఇక రాడని తేలిపోయింది.

‘దృశ్యం-3’ తెలుగు రీమేక్ క్యాన్సిల్ అయినట్లు కన్ఫమ్ అయింది. ఎందుకంటే ఈ నెల 21న మలయాళ వెర్షన్‌తో పాటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ కానుంది. ఈ మేరకు ట్రైలర్ కూడా లాంచ్ కావడంతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ రోజుల్లో రీమేక్‌లు చేయడమే పెద్ద రిస్క్ అయిపోయింది. పైగా ‘దృశ్యం’ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా సౌత్ ఇండియా అంతటా జనాలు మలయాళ వెర్షన్‌ చూడడానికి సిద్ధంగా ఉన్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎలాగూ నెల రోజులకే ఓటీటీలోకి ఆ సినిమా వచ్చేస్తుంది.

అలాంటపుడు మళ్లీ తెలుగులో తీయడం వ్యర్థం. అందుకే వెంకీ అన్నీ ఆలోచించి రీమేక్ నుంచి తప్పుకున్నట్లు ఉన్నాడు. కానీ హిందీలో మాత్రం ఈ చిత్రం రీమేక్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. కానీ ఒరిజినల్ నిర్మాత పెట్టిన కండిషన్ మేరకు ఆ చిత్రాన్ని కొంచెం లేటుగా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబరులో అది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక మలయాళ వెర్షన్‌ను తమిళంలో సైతం అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు.