రామ్ చరణ్ సినిమా టైంలో పంచాయితీలెందుకు?

ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. నిన్న మైత్రి తరఫున శశి ఏకంగా ఒక ఓపెన్ లెటర్ విడుదల చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. సింగల్ స్క్రీన్స్ తో పంచాయితీ ఉన్నప్పుడు జెట్లీని తమ మల్టీప్లెక్సుల్లో కూడా వేయకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఎట్టకేలకు ఇవాళ్టి నుంచి తాత్కాలికంగా పరిష్కారం చేసుకున్నారు కానీ పూర్తిగా సాల్వ్ కాలేదు.

ఈ సమస్య గురించి మే 8 ఫిలిం ఛాంబర్ లో కీలక సమావేశం జరగనుంది. దీన్ని ఒక కొలిక్కి తెచ్చే ఒత్తిడి పెద్దల మీద ఉంది. ఎందుకంటే జూన్ 4 పెద్ది రిలీజవుతోంది. థియేటర్లకు జనాలు రాక పావు వంతు, సగం ఆక్యుపెన్సీలతో నరకం చూస్తున్న ఎగ్జిబిటర్ల ఆశలన్నీ పెద్ది మీదే ఉన్నాయి. పంతానికి పోయి అది వేసుకోము అంటే ఇటు ప్రొడ్యూసర్లు, అటు డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరూ నష్టపోతారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి శుభం కార్డు వేయాల్సిందే.

గత ఏడాది హరిహర వీరమల్లు సమయంలోనూ ఇలాంటి డిస్కషన్ వచ్చి ఆ సినిమాని బ్యాన్ చేయబోతున్నారనే స్థాయిలో పంపిణీదారులు మీద పుకార్లు వచ్చాయి. చివరికి ఏదోలా టెంపరరీ బ్రేక్ వేసి మమ అనిపించారు. కానీ పెద్ది కేసు వేరే. ప్రీ రిలీజ్ వైబ్ విపరీతమైన పాజిటివ్ గా ఉంది. చాలా ఏరియాలలో పుష్ప 2 నెంబర్లు వస్తాయని ట్రేడ్ ధీమాగా ఉంది. రాత్రి ప్రీమియర్ నుంచి పాజిటివ్ టాక్ వస్తే కనీసం పది రోజులు టికెట్లు దొరకవని అంటున్నారు.

సో రామ్ చరణ్ సినిమాని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఇప్పుడు సింగల్ స్క్రీన్స్ డిమాండ్ చేస్తున్నంత పర్సెంటెజ్ ఇవ్వకపోవచ్చు కానీ ఎంతో కొంత మధ్యే మార్గ పరిష్కారం అయితే ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంది. ఒకవేళ పెద్ది రిలీజ్ కనక జూన్ 25కి వెళ్ళిపోయి ఉంటే ఇంకొంచెం నింపాదిగా ఉండేవాళ్ళేమో కానీ పెద్దికి థియేటర్ అగ్రిమెంట్లు చేయాల్సిన టైంలో పంపకాల పంచాయితీ ఉండకూడదు. నైజాం పరిణామాలని బట్టే ఏపీ కదలికలు ఉండబోతున్నాయి.