ఆస్కార్ రూటు… ఇప్పుడు మరింత స్వీటు

భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే అదృష్టం కలగడం లేదు. ఆర్ఆర్ఆర్ కు రాజమౌళి రెండు మూడు విభాగాల్లో ఆస్కార్ గౌరవం ఆశించారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా కేవలం చెల్లో షో అనే గుజరాతి మూవీ మాత్రమే నామినేట్ కావడంతో ఆర్ఆర్ఆర్ కు బెస్ట్ మూవీ క్యాటగిరీలో అవకాశం మిస్సయ్యింది. అయినా సరే నాటు నాటు పాటకు అవార్డు సాధించారు.

ఇకపై ఈ టెన్షన్ ఉండదు. కేన్స్ లాంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ పురస్కారాలు దక్కించుకున్న సినిమాలు నేరుగా ఆస్కార్ కమిటీకి అప్లై చేసుకోవచ్చు. అంతే కాదు ఒక దేశం నుంచి ఒక్కో క్యాటగిరీలో ఒకే సినిమా పరిమితిని కూడా తీసేశారు. ఇది నటులకు కూడా వర్తిస్తుంది. అంటే ఒక సంవత్సరంలో ఒక యాక్టర్ రెండు సినిమాల్లో గొప్పగా నటించాడనుకుంటే తన అర్హతని బట్టి రెండింటికి నామినేట్ చేయొచ్చు సో గెలుపు అవకాశాలు పెరుగుతాయి.

ఇది వారణాసి, రాకా, రామాయణ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కే కాదు పెద్ది లాంటి రూటెడ్ సినిమాలకు సైతం లబ్ది చేకూరుస్తుంది. రాజమౌళి కోరుకున్నది ఇదే. ఆర్ఆర్ఆర్ కు ఎదురైన అడ్డంకులను ఆయన ప్రత్యక్షంగా చూశారు. వాటిని దాటుకోవడానికి ఎంతో సమయం, డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆస్కార్ కు వెళ్ళడానికి ముందే ట్రిపులార్ ఎన్నో చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకుని అవార్డులు సాధించింది. అవే కొంతమేర దోహదపడ్డాయి.

ఈ పరిణామాల పట్ల మూవీ మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియానే దీని నుంచి ఎక్కువ లబ్ది పొందుతుందని చెప్పొచ్చు. కాకపోతే అకాడమీ సభ్యులకు ఇకపై ఎంపిక ప్రక్రియ మరింత క్లిష్టం కానుంది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు చూసి జల్లెడ పట్టాల్సి ఉంటుంది. అది కూడా వేర్వేరు దేశాల నుంచి వచ్చిన వేర్వేరు సినిమాలను. మరి ఇంత గొప్ప అవకాశాన్ని రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.