క్లాసిక్ సినిమాలను ఇలా కాపాడండి

పాత క్లాసిక్స్, బ్లాక్ బస్టర్ సినిమాలకున్న అతి పెద్ద సమస్య ఒరిజినల్ నెగటివ్స్ లభ్యత. ఈ కారణంగానే జగదేకవీరుడు అతిలోకసుందరి, ఆదిత్య 369 లాంటి ఎవర్ గ్రీన్ మూవీస్ రీ రిలీజ్ టైంలో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వలేకపోయాయి. అయినా సరే వాటి మీద ప్రేమతో ప్రేక్షకులు టికెట్లు కొని చూశారు. శివ విషయంలో నాగార్జున తీసుకున్న జాగ్రత్తలు డ్యామేజ్ లేకుండా డిజిటల్ అయ్యేలా చేశాయి. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం మూండ్రమ్ పిరై అనే తమిళ్ మూవీ.

1982లో బాలు మహేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రిలీజయ్యింది. తెలుగులో వసంత కోకిలగా డబ్బింగ్ చేశారు. అద్భుత విజయం సాధించి వంద రోజులకు పైగా ఆడింది. కమల్ హాసన్ – శ్రీదేవి నటన, ఇళయరాజా సంగీతం ఒకదానితో మరొకటి పోటీ పడి ప్రేక్షకులను ప్రేమలో పడేశాయి. కట్ చేస్తే థియేటర్స్ లో ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే చాలా సంవత్సరాలుగా వసంత కోకిల రీ మాస్టర్ ప్రింట్ రాలేదు. యూట్యూబ్ లో క్వాలిటీ అంతంత మాత్రంగా ఉంది.

ఇది గుర్తించిన నిర్మాణ సంస్థ వసంత కోకిల రీ మాస్టర్ వెర్షన్ ని ప్రైమ్ ఓటిటిలో అందుబాటులోకి తెచ్చేసింది. థియేటర్లలో రిలీజ్ చేసి అభిమానులతో టికెట్లు కొనిపించకుండా ఇలా చేయడం మంచి నిర్ణయమే. మాస్ బొమ్మ కాదు కాబట్టి ఇంట్లో చూసి ఎక్స్ పీరియన్స్ అయితేనే బాగుంటుంది. ప్రస్తుతానికి ఒరిజినల్ ఆడియో మాత్రమే ఇవ్వగా త్వరలో తెలుగు డబ్బింగ్ కూడా దానికి జోడిస్తారని సమాచారం. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.

వసంత కోకిలే కాదు ఇలాంటి ఎన్నో క్లాసిక్స్ కి జీవం పోసి జనాలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతసేపూ స్టార్ హీరోల సినిమాలు మాత్రమే రీ రిలీజ్ చేస్తూ డబ్బులు చేసుకోవడం కాకుండా తరతరాలగా ఖ్యాతి సంపాదించుకున్న మాస్టర్ పీసెస్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విచిత్రం ఏమిటంటే 44 సంవత్సరాల తర్వాత వసంత కోకిల ప్రింట్ ని రీ మాస్టర్ చేయడం. తమిళ్ వస్తే షో వేసుకోవచ్చు కానీ తెలుగు కోసమైతే ఇంకొంత కాలం ఆగాలి.