కండల వీరుడి సినిమాకు ‘చైనా’ కష్టాలు

యుద్ధ నేపధ్యాలు, చారిత్రాత్మక సంఘటనలు ఆధారంగా తీసే సినిమాలకు మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ అంగీకారం తప్పనిసరి. లేదంటే సెన్సార్ అభ్యంతరాలు వచ్చి రిలీజ్ ఆగిపోతుంది. అందుకే మేకర్స్ ముందే జాగ్రత్త పడి పర్మిషన్లు గట్రా తీసుకుంటారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న మాతృభూమి షూటింగ్ చివరి దశకు వచ్చింది. దీనికి ముందు అనుకున్న పేరు బాటిల్ అఫ్ గాల్వాన్. 2020లో చైనా దేశంతో వచ్చిన అంతర్యుద్ధం ఆధారంగా దర్శకుడు అపూర్వ లఖియా దీన్ని రాసుకున్నారు.

అయితే గత ఐదేళ్ళలో ఇండియా, చైనా మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో గాల్వన్ ని హైలైట్ చేస్తూ సినిమా వదలడం వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయని భావించిన డిఫెన్స్ మినిస్ట్రీ మూవీలో చైనా పదం, ఆ దేశపు ప్రస్తావన లేకుండా చూడాలని నిర్మాతను నిర్దేశించింది. దీంతో కథకు కల్పన జోడించి 40 శాతం దాకా రీ షూట్ చేశారట. అందుకే ఆలస్యం అయ్యిందని, ముందు అనుకున్న మే 15 విడుదల సాధ్యమయ్యేలా లేదని ముంబై టాక్.

దురంధర్ తర్వాత దేశభక్తి సినిమాలు చూసే కోణం మారిపోయింది. అంత హంగామా చేసుకుంటూ వచ్చిన బోర్డర్ 2 సైతం యుద్ధంలో డ్రామా ఎక్కువైపోవడంతో ఆడియన్స్ మెప్పు ఆశించిన పెద్ద స్థాయిలో పొందలేదు. యష్ రాజ్ సంస్థ తమ స్పై యునివర్స్ కథలను పునఃవిశ్లేషణ చేసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు గాల్వన్ కూడా అదే పరిస్థితి ఎదురుకోవాల్సి రావొచ్చు. అసలే మాతృభూమి అనే పాత జమానా కాలం నాటి టైటిల్ పెట్టారు. ట్రేడ్ వర్గాలకు ఇది నచ్చడం లేదట.

హిట్టు కోసం తపించిపోతున్న సల్మాన్ ఖాన్ కు మాతృభూమి మీద చాలా ఆశలున్నాయి. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే భారీ ప్యాన్ ఇండియా మూవీ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. సౌత్ దర్శకులు తనకు బ్రేక్ ఇస్తారనే నమ్మకంతో మురుగదాస్ తో సికందర్ చేస్తే అదేమో దారుణంగా పోయింది. మరి వారసుడు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వంశీ పైడిపల్లి కండల వీరుడు కోరుకున్న బ్లాక్ బస్టర్ ఇస్తారో లేదో వచ్చే ఏడాది తేలనుంది.