చాలా తక్కువ సమయంలోనే పెద్ద హీరోయిన్గా ఎదిగినప్పటికీ.. చాలా అణకువతో వ్యవహరించే అమ్మాయి శ్రీలీల. ఇప్పటిదాకా ఆమె ఎలాంటి వివాదంలోనూ చిక్కుకోలేదు. ఎప్పుడూ అదుపు తప్పి మాట్లాడింది లేదు. ఎవరికీ పంచ్ వేసింది లేదు. కానీ తొలిసారి ఆమె చేసిన కామెంట్ కొంచెం వివాదాస్పదం అయింది. సినిమాల్లో నటించే అమ్మాయిలకు పీరియడ్స్ అన్నవి ఒక సాకు కాదు అంటూ ఆమె తాజాగా కామెంట్ చేసింది. శ్రీలీల ఇలా మాట్లాడ్డం వెనుక ఒక నేపథ్యం ఉంది.
తెలుగులో ‘ఓం భీం బుష్’ సహా కొన్ని చిత్రాల్లో నటించిన ముంబయి భామ ఆయేషా ఖాన్.. బాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ ‘దురంధర్’లో ఒక ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట చేసేటప్పుడు తాను పీరియడ్స్లో ఉన్నానని.. అయినా ఆ ఇబ్బందితోనే కష్టమైన డ్యాన్స్ మూమెంట్స్ చేశానని ఆయేషా చెప్పడం చర్చనీయాంశం అయింది. చాలామంది ఆమె పట్ల సానుభూతి ప్రకటించారు. ఆమె కమిట్మెంట్ను కొనియాడారు.
కానీ కొందరు మాత్రం ఇదేమంత విషయం అన్నట్లుగా కామెంట్లు చేశారు. పీరియడ్స్లో ఉంటూ అంతకుమించి కష్టం పడే మహిళలు మన చుట్టూ లేరా, దాన్నో పెద్ద విషయంలా చెప్పడమేంటి అన్నట్లుగా మాట్లాడారు. ఐతే ఎవరో ఊరూ పేరు లేని వాళ్లు ఇలాంటి కామెంట్లు చేస్తారు కానీ.. ఒక పేరున్న హీరోయిన్, పైగా ఎంబీబీఎస్ చదువుకున్న శ్రీలీల ఇదే తరహాలో కామెంట్ చేయడమే వివాదానికి దారి తీసింది.
ఒక మహిళగా తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని.. తాను పీరియడ్స్లో ఉండగా ఎన్నో పాటలకు డ్యాన్స్ చేశానని.. దాన్నొక సాకుగా చూపించే అవకాశం లేదని ఆమె స్పష్టం చేసింది.
శారీరకంగా, మానసికంగా అన్ని సవాళ్లకూ సిద్ధంగా ఉండాలని శ్రీలీల అభిప్రాయపడింది. ఆయేషాకు కౌంటర్గా ఉద్దేశపూర్వకరంగానే శ్రీలీల ఈ వ్యాఖ్యలు చేసిందో లేదో కానీ.. అందరూ దానికే కనెక్ట్ చేసుకుంటున్నారు. ఒక మహిళ, పైగా డాక్టర్ అయి ఉండి ఇలాంటి కామెంట్లు చేయడమేంటి అంటూ ఆమెను కొందరు తప్పుబడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates