సాయిపల్లవిని కొట్టేవాళ్లు లేరు

ఈ తరం దక్షిణాది హీరోయిన్లలో నటిగా సాయిపల్లవికి ఉన్న గుర్తింపే వేరు. అందం, గ్లామర్ విషయంలో ఆమె చాలామంది హీరోయిన్లతో పోలిస్తే వెనుకబడే ఉంటుంది. కానీ నటన విషయానికి వస్తే సాయిపల్లవి ముందు ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లు ఎవరూ నిలవలేరంటే అతిశయోక్తి కాదు.

మామూలుగా హీరోయిన్ల గ్లామర్‌కే ఫ్యాన్స్ ఉంటారు. ఆ విషయంలోనే వారిని ఎక్కువగా అభిమానిస్తారు. కానీ హీరోయిన్ల పెర్ఫామెన్స్ మీద ఎక్కువ అంచనాలు పెట్టుకుని ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా అరుదు. ఈ అరుదైన జాబితాలో సాయిపల్లవి ఉంటుంది. ఆమె ఏ సినిమా చేసినా, ఏ పాత్రలో నటించినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. తొలి సినిమా ‘ప్రేమమ్’తోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయిపల్లవి.. ఆ తర్వాత ‘ఫిదా’ సహా ప్రతి సినిమాతోనూ ఆకట్టుకుంటూనే ఉంది.

తాజాగా సాయిపల్లవి డిజిటల్ డెబ్యూ కూడా చేసింది. నెట్ ఫ్లిక్స్ వాళ్లు రూపొందించిన ఆంథాలజీ సిరీస్ ‘పావ కథైగల్’లో ఒక ఎపిసోడ్‌లో సాయిపల్లవి లీడ్ రోల్ చేసింది. ప్రకాష్ రాజ్ ఆమె తండ్రి పాత్రలో నటించాడు. ఈ ఇద్దరు పెర్ఫామర్లు పోటాపోటీగా నటించి ఆ ఎపిసోడ్‌ను పండించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. కుల కట్టుబాట్లు ఎక్కువగా ఉన్న ఊరిలో పెద్ద మనిషి ప్రకాష్ రాజ్ అయితే.. ఆయన నలుగురు కూతుళ్లలో ఒకరు సాయిపల్లవి. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా వేరే కులం వ్యక్తిని ప్రేమించి లేచిపోతుంది. రెండేళ్ల తర్వాత తన జాడ తెలుసుకుని వెళ్తాడు తండ్రి. అప్పుడామె నిండు గర్భవతి. తన పట్టింపులన్నీ వదిలేశానని చెప్పి అల్లుడిని ఒప్పించి కూతురికి సీమంతం చేస్తానని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ వేడుక కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తాడు. కానీ ఆ తర్వాత ఆయనలోని మరో కోణం బయటపడుతుంది. ఆ సమయంలో సాయిపల్లవి నటన చూస్తే ఎంతటి కఠినాత్ములకైనా కన్నీళ్లు రాకమానవు.

సాయిపల్లవి ఎంత గొప్ప నటి అన్నది ఆ సన్నివేశాలు చూపిస్తాయి. ప్రకాష్ రాజ్ కూడా గొప్పగా నటించాడు కానీ.. ఆయన్ని మించి సాయిపల్లవి అదరగొట్టేసింది. ఆ స్థానంలో మరే నటి అయినా కూడా అంత బాగా నటించలేదని ఘంటాపథంగా చెప్పేయొచ్చు. ఇలాంటి నటి దొరకడం దక్షిణాది ప్రేక్షకులు, ఫిలిం మేకర్లు చేసుకున్న అదృష్టం అంటే అతిశయోక్తి కాదు.