2025 గద్దర్ అవార్డుల ప్రకటన జరిగిపోయింది. ఎప్పుడో దశాబ్దంకు పైగా ఆగిపోయిన నంది పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గద్దర్ పేరుతో తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఉగాది ఇంకా పది రోజులు ఉండగానే అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈసారి విశేషం ఏంటంటే చిన్న చిత్రాలకు గొప్ప గుర్తింపు రావడం.
ఉత్తమ చిత్రంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఎంపిక కావడం గొప్ప విషయం. బ్యాక్ డ్రాప్ తెలంగాణకు సంబంధించిదే అయినప్పటికీ దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన విధానం కమిటీ సభ్యులను కదిలించింది. రెండో ఉత్తమ చిత్రం ‘దండోరా’ సైతం ఇదే కోవలో కుల వివక్ష మీద తీసిన సీరియస్ సినిమా. కమర్షియల్ గా అద్భుతాలు చేయకపోయినా చూసిన ప్రేక్షకులు, విమర్శకులతో గొప్ప ప్రశంసలు అందుకుంది.
మూడో చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో నటించింది తిరువీర్ అనే చిన్న హీరో. సింపుల్ కామెడీ, క్లీన్ ఎంటర్ టైన్మెంట్ తో రూపొందిన ఈ మూవీ కూడా పూర్తి అర్హత ఉన్నదే. ఇవి కాకుండా డెబ్యూ డైరెక్టర్ విభాగంలో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడు సాయి మార్తాండ్ కు గద్దర్ గౌరవం దక్కింది. స్పెషల్ జ్యూరిలో 23 సినిమాకు శ్రీరాజ్ రాచకొండ, 8 వసంతాలుకు అనంతిక ఈ అవార్డులను అందుకోబోతున్నారు.
ఇవన్నీ కూడా స్టార్లు లేకుండా చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు. ఒకటి రెండు మినహాయించి డబ్బులు కూడా పెద్ద మొత్తంలో తెచ్చినవే. ఇప్పుడు గద్దర్ పేరు మీద ఉన్న అవార్డులను తీసుకోవడమంటే న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ కి ఎంతో స్ఫూర్తినిచ్చినట్టు అవుతుంది.
ఈ విషయంలో కమిటీ సభ్యులను మెచ్చుకోవాలి. కేవలం బడ్జెట్, బిజినెస్ కోణంలో చూడకుండా పూర్తిగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇచ్చి జనాన్ని కదిలించినవి ఏవో గుర్తించి వాటినే ఎంపిక చేయడం మంచి నిర్ణయం. ఇకపై ప్రతి సంవత్సరం ఇలాగే క్రమం తప్పకుండ గద్దర్ పురస్కారాలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates