300 కోట్ల సీక్వెల్… ఇలా అయ్యిందేంటి

వివాదాలు, కేసులతో వార్తల్లో నానిన ది కేరళ స్టోరీ 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. మొదటి వీకెండ్ పట్టుమని పదిహేను కోట్ల నెట్ కూడా వసూలు కాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే పెట్టిన బడ్జెట్ కేవలం నలభై కోట్ల లోపే ఉండటంతో ఓటిటి, శాటిలైట్ తో కలుపుకుని ఈజీగా రికవర్ కావొచ్చనే నమ్మకంతో టీమ్ ఉంది.

కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో మినహాయించి చాలా చోట్ల కేరళ స్టోరీ 2కి కనీసం స్పందన కరువయ్యింది. కంటెంట్ ఏముందో ముందుగానే ట్రైలర్ లో చూపించడంతో ఆడియన్స్ కి దీని పట్ల ఆసక్తి కలగడం లేదు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే.

ఇలా జరగడానికి కారణాలున్నాయి. కేరళ స్టోరీ 2 పూర్తిగా వన్ సైడ్ అజెండాతో తీశారు. చిన్న లైన్ ని రెండు గంటల అయిదు నిముషాలు సాగదీయడంతో ఆడియన్స్ ని మెప్పించే అంశాలు లేకపోయాయి. లవ్ జిహాద్ పేరుతో కొన్ని చోట్ల దారుణాలు జరుగుతున్న మాట వాస్తవమే. కానీ ఇందులో మరీ తీవ్ర స్థాయిలో చూపెట్టడం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేలా ఉంది.

తప్పులు చేస్తోంది ఏ వర్గం వారైనా అధిక శాతం ఇలాగే ఉంటారన్న తరహాలో చేసిన ప్రొజెక్షన్ వాస్తవికతకు దూరంగా వెళ్ళింది. కథ ప్రకారం లీడ్ యాక్టర్స్ గా నటించిన ముగ్గురిలో ఒక అమ్మాయిని ఆత్మహత్యకు పురిగొల్పడం మరీ నాటకీయంగా ఉంది.

దర్శక నిర్మాతల ఉద్దేశాలు లక్ష్యాలు ఏమైనా అవి నెరవేరే సూచనలు కనిపించడం లేదు. మాములుగా సీక్వెల్స్ అంటే ఓ రేంజ్ హైప్ ఉంటుంది. కేరళ స్టోరీ 2 మేకర్స్ కూడా అదే స్థాయిలో ఆశించారు. కానీ భంగపాటు తప్పలేదు. ఏపీ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీలు మరీ అన్యాయంగా ఉండటం చూసి బయ్యర్లు బెంబేలెత్తిపోతున్నారు. నిజ జీవిత ఘోరాలను సినిమాగా తీయడంలో తప్పు లేదు. కాకపోతే వాటిని మరీ అతిశయోక్తిగా చూపించడమే బాలేదు. అయితే ఇప్పటి అమ్మాయిల విపరీత మానసిక ప్రవర్తనను చూపించడంలో మాత్రం లక్ష్మణ్ కామాఖ్య సింగ్ ఓ మోస్తరుగా సక్సెసయ్యారని చెప్పొచ్చు.