చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించడం ద్వారా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుల్లో తన పేరుని శాశ్వతంగా లిఖించుకున్నారు.
గత ఏడాది నీరజ కోన తెలుసు కదాతో, అంతకు ముందు లక్ష్మి సౌజన్య వరుడు కావలెనుతో తమ టాలెంట్ ఋజువు చేసుకునే ప్రయత్నం చేశారు కానీ ఆశించిన ఫలితాలు దక్కలేదు. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ మెగా ఫోన్ చేపట్టారు. సరస్వతి పేరుతో రూపొందిన కోర్ట్ రూమ్ కం క్రైమ్ థ్రిల్లర్ విడుదలకు రెడీ అయిపోయింది. టీజర్ వదిలారు.
తప్పిపోయిన కూతురు కోసం ఇద్దరు తల్లులు పడే ఆరాటాన్ని ఎమోషన్, క్రైమ్, సెంటిమెంట్ అన్నీ మిక్స్ చేసి మేళవించిన తీరు ఆసక్తి రేపెలా ఉంది. క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ విషయంలో వరలక్ష్మి రాజీ పడలేదు. ప్రకాష్ రాజ్, ప్రియమణి, నాజర్, రావు రమేష్, మురళి శర్మ, కిషోర్, రఘు బాబు లాంటి సీనియర్ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు.
కంటెంట్ లో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సంగీతం కోసం ఏకంగా తమన్ ని తీసుకున్నారు. సాయి మాధవ్ బుర్రా కథను అందించారు. ఈటీవీ విన్ నిర్మాణ భాగస్వామ్యం ఉంది. బడ్జెట్ బాగానే అయ్యిందని టాక్. సోదరి పూజాతో కలిసి వరలక్ష్మి దీనికి నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.
ఇలాంటివి వర్కౌట్ కావాలి. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు కానీ ఒక్క సినిమా పరిశ్రమలో మాత్రం వీళ్ళ ఉనికి నెమ్మదిగా ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళ నందిని రెడ్డి ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నాయి. ప్రస్తుతం సమంతతో మా ఇంటి బంగారం చేస్తున్నారు.
గతంలో బి జయ, జీవిత రాజశేఖర్, సుచిత్ర చంద్రబోస్ లాంటి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ వాటిలో రిజల్ట్స్ దక్కినవి కొన్నే. మరి వరలక్ష్మి శరత్ కుమార్ దీన్ని బ్రేక్ చేసి కొత్త ట్రెండ్ కి శ్రీకారం ఏమైనా చుడతారేమో చూడాలి. మార్చి 6 సరస్వతి విడుదల కానుంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చేసింది కాబట్టి బిజినెస్ వ్యవహారాలు ఊపందుకునే ఛాన్స్ ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates