కంగ‌నా చేసిన అన్యాయంపై క్రిష్ స‌వివ‌రంగా..

మ‌న ద‌ర్శ‌కుడు క్రిష్ బాలీవుడ్లో మ‌ణిక‌ర్ణిక లాంటి భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడ‌ని అంద‌రూ సంతోషించారు. కానీ అత‌నా సినిమాను పూర్తి చేశాక క‌థానాయిక కంగ‌నా ర‌నౌత్ రంగంలోకి దిగి, క్రిష్‌ను ప‌క్క‌న పెట్టి సొంతంగా అనేక స‌న్నివేశాలు రీషూట్లు చేయ‌డం ఎంత వివాదానికి దారి తీసిందో తెలిసిందే.

దీనిపై ఇప్ప‌టికే ఒక‌సారి ఓ బాలీవుడ్ మీడియా సంస్థ‌తో త‌న ఆవేద‌న పంచుకున్నాడు క్రిష్‌. ఇప్పుడు ఆహా ఓటీటీలో స‌మంత నిర్వ‌హించే టాక్ షోకు అతిథిగా వ‌చ్చిన క్రిష్ ఆ వివాదంపై వివ‌రంగా మాట్లాడాడు. అస‌లు ఆ సినిమా విష‌యంలో ఎప్పుడేం జ‌రిగిందో, కంగ‌నా త‌న ప‌ట్ల ఎంత అన్యాయంగా ప్ర‌వ‌ర్తించిందో కూలంక‌షంగా క్రిష్ వివ‌రించాడు.

‘‘91 రోజుల పాటు మేమంతా ఎంతో సంతోషంగా ‘మణికర్ణిక’ షూటింగ్‌ పూర్తి చేశాం. షూట్ జ‌రుగుతుండ‌గా కంగనకు, నాకూ మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు. అంతా ఎంతో సంతోషంగా సాగిపోయింది. రీరికార్డింగ్ జ‌రుగుతున్న‌పుడు కంగన టీమ్ వ‌చ్చి సినిమా చూశారు. ఫస్ట్‌ హాఫ్‌ వాళ్లకి బాగా నచ్చింది. సెకండ్ హాఫ్‌ కూడా బాగుందని చెప్పారు.
కానీ కొన్ని రోజుల త‌ర్వాత వాళ్ల నుంచి నాకు ఫోన్ వ‌చ్చింది. కొన్ని స‌న్నివేశాలు బాలేవ‌ని, కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ స‌రిగా లేద‌ని చెప్పారు. అలాగే సోనూ సూద్ చేసిన స‌దాశివ్ పాత్ర విష‌యంలో అభ్యంత‌రం తెలిపారు. ద్వితీయార్ధంలో ఆ పాత్ర చివరి 20 నిమిషాల వరకూ ఉంటుంది. అది వాళ్లకు నచ్చలేదు. ఆ పాత్ర‌ను ప్ర‌థ‌మార్ధంలోనే ముగించ‌మ‌న్నారు. అది నా వల్ల కాదని, ‘మణికర్ణిక’ లాంటి చ‌రిత్రతో ముడిప‌డ్డ సినిమాలో అలా చేయ‌లేమ‌ని చెప్పాను. త‌న పాత్ర‌ను ఇలా త‌గ్గించ‌డానికి సోనూ కూడా ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని సోనూ కంగనాకు ఫోన్‌ చేసి చెప్పాడు.
అందుకామె.. ‘క్రిష్‌ రీషూట్‌ చేయకపోతే నేను చిత్రీకరిస్తాను’ అని సమాధానమివ్వడంతో వివాదం మొద‌లైంది. ఆ తర్వాత వాళ్లే రీషూట్‌ చేసుకున్నారు. నా బాధ ఏమిటంటే.. నేను అనుకున్న, తెరకెక్కించిన కథను ప్రజలకు చూపించలేకపోయాను’’ అని క్రిష్‌ తెలిపాడు. ఐతే ఈ వివాదంపై తాను మాట్లాడ‌టం ఇదే చివ‌రిసార‌ని, ఇక‌పై ఎప్పుడూ దాని గురించి మాట్లాడ‌ద‌లుచుకోలేద‌ని క్రిష్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.