దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు మార్చుకుంటుందనే ప్రచారం మీడియా వర్గాల్లో జోరుగా తిరిగింది. కానీ యష్ బృందానికి అలాంటి ఆలోచనేదీ లేదట. ఆరు నూరైనా మార్చి 19 విడుదలలో ఎలాంటి మార్పు ఉండదని బెంగళూరు వర్గాలు ఉటంకిస్తున్నాయి.
ఇంత ధైర్యం వెనుక కారణం ఏమిటనేది మూవీ లవర్స్ మెదళ్లను తొలిచేస్తోంది. నిర్మాణ సంస్థ కెవిఎన్ ఇప్పటికీ చిక్కుల్లో ఉంది. జన నాయకుడు కోర్టు కేసుల వల్ల అంతకంతా ఆలస్యం కావడం ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపించింది. పెట్టుబడులు పెద్ద ఎత్తున బ్లాక్ అయిపోయాయి.
ఈ కారణంగానే చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో ప్లాన్ చేసుకున్న మూవీ ఓపెనింగ్ వాయిదా పడిందనేది ఓపెన్ సీక్రెట్. టీమ్ అధికారికంగా చెప్పకపోయినా ఫిలిం నగర్ లో ఇదే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు టాక్సిక్ కూడా పోస్ట్ పోన్ బాట పడితే కెవిఎన్ కు మరో గుదిబండ తగలడం ఖాయం.
దురంధర్ 2 మీద విపరీతమైన బజ్ ఉన్నప్పటికీ దానికి ఎదురుగా ఇంకెవరూ ఉండకూడదని కాదు. పైగా యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని వినికిడి. ట్రైలర్ చూశాక ఒక్కసారిగా అంచనాలు తమవైపు తిరుగుతాయనే ధీమా వాళ్ళలో ఉందని సన్నిహితుల మాట.
ఒకవేళ క్లాష్ నిజమైతే మాత్రం టాక్సిక్ కు ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత స్ట్రగుల్ తప్పదు. కాకపోతే ఎవరికి బెటర్ టాక్ వస్తుందనే దాని మీద వసూళ్లు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికైతే దురంధర్ 2కి ఎక్కువ ఎడ్జ్ ఉంది. టీజర్ తో అటెన్షన్ కన్నా కాంట్రవర్సి ఎక్కువ మూటగట్టుకున్న టాక్సిక్ ముందు ఆ ముద్ర పోయేలా ఏదైనా కొత్త యాక్షన్ కంటెంట్ వదలాలి.
లేదంటే ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండే ప్రమాదం లేకపోలేదు. దురంధర్ కి ఆ రిస్క్ లేదు. ఏ సర్టిఫికెట్ ఉన్నా సరే ఉత్తరాది రాష్ట్రాల్లో పిల్లా పెద్ద ఎగబడి చూశారు. సో టాక్సిక్ నిర్ణయంలో మార్పు లేకపోవడం దాదాపు ఖరారే కాబట్టి యుద్ధం రసవత్తరంగా మారనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates