కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు. వాళ్లవి కథలో ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్రల్లా కనిపించవు. కానీ తండ్రి, మావయ్య తరహా సహాయ పాత్రల్లో వందల సినిమాలు చేసి ఉంటారు. ఇలాంటి నటుడే రఘునాథరెడ్డి.
ఈ పేరు చెప్పి అతనెవరు అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ఆయన ఫొటో చూస్తే మాత్రం ముందు తరం ప్రేక్షకులందరికీ ఆయనెవరో తెలుస్తుంది. తెలుగులో ఏకంగా 370 సినిమాల్లో నటించిన ఈ నటుడు శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. హైదరాబాద్ కుషాయిగూడలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు.
విషాదం ఏంటంటే.. రఘునాథ రెడ్డి నెల కిందటే తన కొడుకును కోల్పోయారు. అతను కూడా గుండెపోటుతోనే మరణించారు. ఆ బాధతోనే ఆయన కుంగుబాటుకు గురయ్యారని.. ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతున్నారు. రఘునాథ రెడ్డి 90వ దశకం ఆరంభం నుంచి ఓ 20 ఏళ్ల పాటు నిర్విరామంగా సినిమాలు చేశారు. అప్పట్లో తెలుగులో తెరకెక్కిన మెజారిటీ చిత్రాల్లో ఆయన సహాయ పాత్రలు పోషించారు.
కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం.. ఇలా ఎన్నో పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్లో కనిపించారు. ముఖ్యంగా హీరోయిన్ తండ్రి పాత్రలకైతే లెక్కే లేదు. శోభన్ బాబు సర్పయాగం చిత్రంతో నటుడిగా పరిచయం అయిన రఘునాథ రెడ్డి.. చివరగా 2018లో సుమంత్ మూవీ సుబ్రహ్మణ్యపురంలో నటించారు.
అనారోగ్యంతో ఆ తర్వాత నటనకు గుడ్బై చెప్పారు. గత ఏడాది కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో ఆయన ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి. రఘునాథరెడ్డి మృతదేహాన్ని సందర్శించిన సీనియర్ నటి శిపార్వతి.. ఇంతటి సీనియర్ నటుడు చనిపోతే పరిశ్రమ పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates