ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా చూస్తే.. సినిమా థియేటర్లలో రిలీజైన మూణ్నాలుగు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేసేస్తారు. థియేటర్లలో బాగా ఆడుతున్న సమయంలోనే ఓటీటీలోకి దిగిన చిత్రాలు చాలానే చూశాం. ఇప్పుడు శర్వానంద్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా ఇదే బాటలో సాగుతోంది.
సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైందీ చిత్రం. రిలీజై రెండు వారాలు దాటినా ఈ చిత్రానికి ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి. ఇటీవలే సక్సెస్ మీట్లో శర్వా మాట్లాడుతూ.. తమ సినిమా థియేట్రికల్ రన్ ఇప్పట్లో ఆగదు అన్నాడు. నాలుగు వారాల పాటు సినిమా ఆడుతుందని చెప్పాడు. కట్ చేస్తే.. ఈ సినిమా థియేట్రికల్ రన్ మూడు వారాలు (20 రోజులు) అయ్యేసరికే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
ఫిబ్రవరి 4న ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అమేజాన్ ప్రైమ్ సంస్థ ప్రకటించింది. ఈ రోజుల్లో దాదాపుగా అన్ని సినిమాలూ నెల రోజులకే స్ట్రీమింగ్కు వస్తున్నాయి. కానీ శర్వా సినిమా మరీ మూడు వారాలకే డిజిటల్గా రిలీజైపోతోంది. థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకుని, ఇప్పటికీ ఓ మోస్తరు వసూళ్లు రాబడుతున్న సినిమా ఇంత త్వరగా ఓటీటీలోకి రావడమేంటో అర్థం కావడం లేదు.
కనీసం నాలుగు వారాల విండో ఉండేలా అయినా డిజిటల్ డీల్ చేసుకోవాల్సింది కదా? అయినా శర్వాకు ఈ సినిమా ఫిబ్రవరి 4నే రాబోతోందని తెలియకుండా ఉంటుందా? అయినా తన సినిమా ఇప్పట్లో ఆగదు, నాలుగు వారాలు ఆడుతుంది అని ఎలా చెప్పగలిగాడో? ఇలా నిర్మాతలు డిజిటల్ డీల్స్కు ఆశపడి విండో తగ్గించుకుంటూ పోతే రాను రాను థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత తగ్గిపోయేందుకు ఆస్కారముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates