నేషనల్ అవార్డులకు ఇవి కౌంటరా?

జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం మామూలే. 2021లో నేషనల్ అవార్డ్స్ ప్రకటించినపుడు చాలామంది ఒక సినిమాకు అన్యాయం చేశారని ఫీలైంది ‘జై భీమ్’ విషయంలోనే.

సూర్య ప్రధాన పాత్రలో టీజీ జ్ఞానవేల్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజై అద్భుత స్పందన తెచ్చుకుంది. తప్పుడు కేసులో ఇరుక్కుని లాకప్ డెత్‌కు గురైన ఒక వ్యక్తి కుటుంబం కోసం పోరాడే లాయర్ కథ ఇది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ గొప్పగా తీర్చిదిద్దాడు.

సూర్యతో పాటు లిజోమోల్ జోస్, మణికందన్ ముఖ్య పాత్రల్లో చాలా బాగా నటించారు. ఇది జాతీయ అవార్డుల్లో ‘ఉత్తమ చిత్రం’గా నిలుస్తుందని, మరి కొన్ని అవార్డులూ సాధిస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఒక్క పురస్కారమూ దక్కలేదు. దీని పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. మన స్టార్ హీరో నాని సైతం ‘జై భీమ్’కు అవార్డు రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. ఐతే సినిమాలో కొంత ప్రాపగండా ఉందని, అందుకే అవార్డులు రాలేదనే చర్చ జరిగింది.

ఐతే నేషనల్ అవార్డుల్లో జరిగిన అన్యాయానికి కౌంటర్ అన్నట్లుగా ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ చిత్రానికి పురస్కారాల మీద పురస్కారాలు ఇచ్చేసింది. తమిళ సినిమాలకు 2016-22 మధ్య ఏడు సంవత్సరాలకు కలిపి ఒకేసారి అవార్డులు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

2021 సంవత్సరానికి ‘జై భీమ్’ సినిమా ఏకంగా ఏడు అవార్డులు కొల్లగొట్టింది. ఏడేళ్ల వ్యవధిలో ఒక చిత్రానికి దక్కిన అత్యధిక అవార్డులు ఇవే. 2021కి ఉత్తమ చిత్రం ‘జై భీమ్’యే కాగా.. ఉత్తమ నటిగా లిజోమోల్ జోస్ ఎంపికైంది. ఇంకా ఉత్తమ విలన్‌, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డులు కూడా ఆ చిత్రానికే దక్కాయి.

మరోవైపు 2022లో ‘గార్గి’ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వస్తుందని ఆశించి నిరాశపడ్డ సాయిపల్లవికి కూడా తమిళనాడు ప్రభుత్వం పురస్కారం కట్టబెట్టింది. ఈ ఏడేళ్లకు వరుసగా విజయ్ సేతుపతి, కార్తి, ధనుష్, పార్తిబన్, సూర్య, ఆర్య, విక్రమ్ ప్రభు ఉత్తమ నటులుగా ఎంపిక కాగా.. సాయిపల్లవి, లిజోమోల్ కాకుండా జ్యోతిక, నయనతార, కీర్తి సురేష్, మంజు వారియర్, అపర్ణ బాలమురళి ఉత్తమ నటీమణులుగా పురస్కారాలు దక్కించుకున్నారు.