అకీరానే కాదు అందరూ జాగ్రత్త పడాలి

పవన్ కళ్యాణ్ వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఇంకా ఇండస్ట్రీకి రాకముందే హాట్ టాపిక్ అవుతున్నాడు. తన అనుమతి, ప్రమేయం లేకుండా ఏఐ లవ్ స్టోరీ అనే ఇండిపెండెంట్ మూవీని తీసి, దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం గురించి అకీరా కోర్టుకి వెళ్లిన సంగతి తెలిసిందే.

దానికి న్యాయస్థానం స్పందిస్తూ తక్షణం ఆ కంటెంట్ ని సస్పెండ్ చేయడమే కాక అతని ఫోటో, స్వరం తదితరాలు ఏ రూపంలోనూ వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇది జరిగే సమయానికే ఏఐ లవ్ స్టోరీ మిలియన్ వ్యూస్ దాటేయగా ఇంగ్లీష్ వెర్షన్ ని పాతిక వేల మంది చూసేయడం గమనార్హం.

ఇక్కడ అకీరా ఒకడే కాదు ఇకపై అందరూ ఇలాగే జాగ్రత్త పడే పరిస్థితులు రాబోతున్నాయి. ఆల్రెడీ చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్, జూనియర్ ఎన్టీఆర్, ఐశ్వర్యరాయ్ ఈ విషయంలో తమ హక్కులను కాపాడుకునేందుకు కోర్టు ద్వారా రక్షణ పొందారు. అసలే ఏఐని విచ్చలవిడిగా వాడుతున్న తీరు ఆందోళన రేపుతోంది.

ప్రస్తుతానికి కొన్ని పాజిటివ్ గా అనిపిస్తున్నప్పటికీ ఫ్యూచర్ లో ఇదే పెను ప్రమాదంగా మారే అవకాశాలు లేకపోలేదు. అసలు ఏఐ సామాన్యుల చేతికి రాకముందే రష్మిక మందన్న, అలియా భట్ లాంటి వాళ్ళు డీప్ ఫేక్ టెక్నాలజీ బారినపడి మానసిక క్షోభ అనుభవించారు. ఇప్పుడీ సాంకేతికత హద్దులు దాటేస్తోంది.

ఒక కంప్యూటర్ సిస్టం, కాసింత ఏఐ వాడే తెలివితేటలు ఉంటే చాలు ఏకంగా సినిమాలు తీసే స్థాయిలో టెక్నాలజీ పెరిగిపోయింది. జనాలు నిజమేదో అబద్దమేదో కనిపెట్టలేని పరిస్థితి రావొచ్చు. ఆ మధ్య మన టాలీవుడ్ స్టార్లందరూ ఒక కేఫ్ దగ్గర టీ తాగుతున్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. ఏఐ మీద అవగాహన లేనివాళ్లకు అది నిజమే అనిపించేలా ఉంది.

అకీరాతో పాటు మహేష్ బాబు కొడుకు గౌతమ్ ని కూడా పెట్టి ఒక ఏఐ మూవీ తీసిన ఘనుడు ఉన్నాడు. ఏది ఏమైనా మొగ్గ దశలోనే దీన్ని తుంచివేయడం చాలా అవసరం. లేదంటే పొలానికి పట్టిన పురుగు పంటంతా నాశనం చేసినట్టు దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.