రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ న్ కు పద్మ శ్రీ దక్కింది. ఇక, టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, సీనియర్ నటుడు గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ ను పద్మ శ్రీ వరించింది. కళల విభాగంలో వీరిద్దనీ పద్మ శ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
1973లో జగమే మాయ చిత్రంతో తెరంగేట్రం చేసిన మురళీ మోహన్ 350కి పైగా చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 1985లో ఓ తండ్రి తీర్పు చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 2001లో ప్రేమించు చిత్రానికిగాను, 2003లో వేగు చుక్కలు చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు దక్కించుకున్నారు.
2017లో మురళీ మోహన్ ను సైమా జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ జయభేరి గ్రూప్ చైర్మన్ గా అతడు వంటి హిట్ చిత్రాలను అందించారు. సినీరంగానికి మురళీ మోహన్ చేసిన సేవలకుగాను కళల కేటగిరీ నుంచి ఆయనను పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేశారు.
ఇక, టాలీవుడ్ నట కిరీటిగా ప్రసిద్ధి కమెడియన్ గా రాజేంద్ర ప్రసాద్ విశేష సేవలందించారు. 1981లో అన్న ఎన్టీఆర్ పిలుపుతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రాజేంద్ర ప్రసాద్ 200కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
1991లో ఎర్రమందారం చిత్రానికి, 2004లో ఆ నలుగురు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రాజేంద్ర ప్రసాద్ నంది అవార్డు అందుకున్నారు. 1994లో మేడం చిత్రానికి గాను నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు, 2014లో టామీ చిత్రానికిగానూ ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గా నంది అవార్డు దక్కించుకున్నారు.
వీటితోపాటు 3 సైమా అవార్డులు, 3 సంతోషం ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు. ఈ తరం నటులతో పోటీపడి మరీ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను రాజేంద్రప్రసాద్ ఇంకా అలరిస్తూనే ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates