అరుపులపై రేణు దేశాయ్ వివరణ

వీధి కుక్కలను ఇష్టానుసారం చంపేయడాన్ని నిరసిస్తూ నిన్నటి ఓ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒక దశలో పూర్తిగా సహనం కోల్పోయిన రేణు.. మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. గట్టిగా అరుస్తూ కుక్కల కోసం తన వాదన వినిపించారు. దీనిపై మీడియా ప్రతినిధుల నుంచి నిరసన వ్యక్తమైంది.

మరోవైపు రేణు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు. మనుషుల కంటే కుక్కల ప్రాణాలకే విలువ ఎక్కువా అంటూ ఆమె తీరును దుయ్యబట్టారు. ఆమె మీద ఇంకా రకరకాల కామెంట్లు చేశారు. రేణు రాజకీయాల్లోకి రావాాలనుకుంటోందని.. అందుకే ఇలా ప్రెస్ మీట్ పెట్టి వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తోందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో రేణు ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ముందుగా తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం మీదే రేణు స్పందించారు. తనకు అలాంటి ఉద్దేశం ఎంతమాత్రం లేదని.. తాను ఏ పార్టీలో చేరట్లేదని.. తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చేట్లయితే.. దాని గురించి ముందే అధికారికంగా ప్రకటన చేస్తానన్నారు.

ఇక మీడియాతో వాగ్వాదం గురించి రేణు మాట్లాడుతూ.. తాను మొత్తంగా మీడియాను నిందించలేదని, వారి మీద అరవలేదని స్పష్టం చేశారు. బయట నుండి వచ్చిన ఒక వ్యక్తి తనను దూషించినట్లు మాట్లాడడం, మీదికొచ్చి కొట్టేలా కనిపించడంతో తన మీద అరిచాను తప్ప, తనకు మీడియా మీద ఎలాంటి ద్వేష భావం లేదని ఆమె అన్నారు.

ఇక సోషల్ మీడియా ట్రోల్స్ గురించి చెబుతూ.. తాను లాభాపేక్ష లేకుండా ఎన్జీవో నడుపుతూ వీలైనంత సేవ చేస్తున్నానని.. ఈ క్రమంలో మూగ జీవాల కోసం పోరాడుతున్నానని.. దానికి ఇంతగా వ్యక్తిగత దాడి చేయాలా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇందుకే రేణును వదిలేశాడనడం.. కుక్క కరిచి మీ పిల్లలు చనిపోతే తెలుస్తుంది బాధ అని కామెంట్లు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని రేణు ప్రశ్నించారు.