బొమ్మా బొరుసా… కోర్టు చేతిలో జీవోల బంతి

ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకోవడం, ఎవరో ఒకరు టికెట్ రేట్లు అన్యాయమంటూ కోర్టుకు వెళ్లడం, తర్వాత సదరు మంత్రులు ఇకపై హైక్స్ ఉండవని మీడియా ముందు చెప్పడం పరిపాటిగా మారిపోయింది. అందుకే ఈసారి నిర్మాతలు తెలివిగా తామే హైకోర్టు మెట్లు ఎక్కారు.

రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు నిర్మాతలు సంయుక్తంగా కోర్టుకి చేసిన అప్పీల్ లో ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుకి సంబంధించి సానుకూలంగా స్పందించేలా, హోమ్ శాఖా కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ అందులో కోరారు. అత్యవసరంగా విచారించమని లాయర్లు కోరినా జడ్జ్ గారు బుధవారానికి హియరింగ్ ఫిక్స్ చేశారు.

ఇప్పుడీ పరిణామం రసవత్తరంగా మారింది. కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లకు అనుకూలంగా ఆదేశాలు వస్తే మిగిలిన వాళ్ళు అదే ఫాలో అవుతారు. పదే పదే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఏదైనా మెలిక పెట్టి నిర్ణయం ప్రభుత్వానికి వదిలేస్తే ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు.

లేదూ పిటీషన్ కొట్టేసి అలా పెంచుకోవడం కుదరదు అంటే హార్ట్ ఎటాక్ వచ్చేవాళ్ల సంఖ్య పెరుగుతుంది. ఇదంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా సరే కోర్టు రేపే తేల్చేయాలి. ఎందుకంటే ఎక్కువ టైం లేదు.

గురువారం రాత్రి ప్రీమియర్లు పడాలంటే కనీసం బుధవారం మధ్యాన్నం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టాలి. కానీ ఇప్పటిదాకా టికెట్ల అమ్మకాలు మొదలుకాలేదు. జనవరి 9 ముందు వచ్చేది ప్రభాస్ సినిమానే కాబట్టి డార్లింగ్ ఫ్యాన్స్ తెగ వర్రీ అవుతున్నారు. ప్రీమియర్లు లేకపోతే ఓపెనింగ్స్ పరంగా దెబ్బ పడుతుంది.

రెగ్యులర్ షోలకు నిర్మాత కోరినంత హైక్ ఇవ్వకపోతే ఆ ప్రభావం నేరుగా నెంబర్ల మీద ఎఫెక్ట్ అవుతుంది. మన శంకరవరప్రసాద్ విడుదల జనవరి 12 కాబట్టి కొంచెం అదనపు సమయం ఉంది కానీ ఏదైనా సరే వీలైనంత త్వరగా తేల్చేయడం బెటర్. రేపు కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయనేది చూడాలి.