ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కొల్లగొట్టి దూసుకుపోతూనే ఉన్న దురంధర్ కొందరి జీవితాలను సమూలంగా మార్చేసింది. వాళ్లలో అక్షయ్ ఖన్నా ఒకరు. ఆయన చేసిన విలన్ క్యారెక్టర్ రెహమాన్ డెకాయిట్ స్క్రీన్ మీద మాములుగా పేలలేదు. ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల హీరోని డామినేట్ చేసే స్థాయిలో ఆ పాత్ర పండిందన్నది వాస్తవం.
మూడు దశాబ్దాల కెరీర్ ఉన్న అక్షయ్ ఖన్నా మొదట్లో హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికీ స్టార్ స్థాయికి చేరుకోలేదు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక మంచి బ్రేక్స్ దొరుకుతున్నాయి. కానీ ఇప్పుడీ విలక్షణ నటుడు వివాదానికి కేంద్రంగా మారుతున్నాడు.
మరికొద్ది రోజుల్లో అజయ్ దేవగన్ దృశ్యం 3 రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించనున్న అక్షయ్ ఖన్నా దురంధర్ ముందే దీని కోసం అడ్వాన్స్ తీసుకున్నాడట. కానీ ఇప్పుడు పారితోషికం పెంచాలని అడుగుతూ ఏకంగా పాతిక కోట్ల ఫిగర్ చెప్పడంతో నిర్మాతలు షాక్ తిన్నారట.
అందులో సగం ఇచ్చినా కూడా వర్కౌట్ కాదనేది వాళ్ళ భావన. పది రోజుల ముందు ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం పట్ల నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ ఏకంగా లీగల్ నోటీసులు పంపారట. ఈ వివాదం ఇప్పట్లో తేలదు కాబట్టి ఆ స్థానంలో పాతాల్ లోక్ వెబ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న జైదీప్ ఆహ్లావత్ ని తీసుకున్నారట. నిర్మాత ఆ మేరకు ధృవీకరించారని బాలీవుడ్ టాక్.
ముంబై వర్గాల ప్రకారం పైన సమాచారాన్ని క్రోడీకరిస్తే అక్షయ్ ఖన్నా అగ్రిమెంట్ కు ముందే నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఈసారి విగ్గు పెట్టుకుని నటిస్తానని కొత్త కండీషన్ పెట్టాడట. అలా చేస్తే ఇంపాక్ట్ మరింత తగ్గుతుంది.
ప్రస్తుతం దీని గురించి అక్షయ్ ఖన్నా స్పందించడం లేదు. దురంధర్ సక్సెస్ మీట్లు, ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కూడా కనిపించలేదు. తన ఇంట్లోనే మీడియా హడావిడికి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడీ దృశ్యం 3 మాటర్ కొంచెం సీరియస్ అయ్యేలా ఉండటంతో వ్యవహారం కోర్టు దాకా వెళ్లేలా ఉంది. మరి రెహమాన్ డెకాయిట్ ఏం చేస్తాడో.
Gulte Telugu Telugu Political and Movie News Updates