దండోరా సౌండుకి సెన్సార్ చిక్కులు ?

క్రిస్మస్ పండక్కు వస్తున్న సినిమాల్లో దండోరా అనే చిన్న మూవీ బాగానే సౌండ్ చేస్తోంది. ప్రమోషన్లతో ఆడియన్స్ దృష్టిలో పడ్డ టీమ్ ఒక రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామాని మంచి సందేశంతో పొందుపరిచామని చెబుతోంది. ఆ నమ్మకంతోనే రెండు రోజుల ముందే ప్రీమియర్లకు సిద్ధ పడ్డారు.

తొలుత అనుకున్న ప్రకారం డిసెంబర్ 23 ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ లో షోలు వేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే సెన్సార్ సమయానికి కాకపోవడంతో బుకింగ్స్ ఓపెన్ చేయలేకపోయారు. దీంతో బుక్ మై షోలో చెక్ చేసుకుంటున్న మూవీ లవర్స్ కి నిరాశ ఎదురయ్యింది. సెన్సార్ ఈ రోజు కాకపోవచ్చని టాక్.

రేపు సాయంత్రం నుంచి శంభాల ప్రీమియర్లు ఉన్నాయి. ఆల్రెడీ హైదరాబాద్ లో రెండు మూడు షోలు ఫుల్ అయ్యాయి. మిగిలిన చోట్ల కూడా యాడ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ దండోరాకు క్లియరెన్స్ వచ్చినా దీంతో క్లాష్ అవ్వక తప్పదు.

దీని బదులు నేరుగా డిసెంబర్ 25 రెగ్యులర్ రిలీజ్ కు వెళ్లిపోదామనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. నిజానికి ఇంత అడ్వాన్స్ గా షోలు వేసుకోవడానికి దండోరాకు కారణం ఉంది. ఛాంపియన్, ఈషా, శంభాల, వృషభతో కాంపిటేషన్ ఉన్న నేపథ్యంలో ముందే అందరికీ సినిమా చూపిస్తే సోషల్ మీడియాలో హైప్ వస్తుందని భావించి ఇలా చేశారు.

సెన్సార్ దగ్గర సమస్య ఏంటయ్యా అని ఎంక్వయిరీ చేస్తే ఇందులో పలు సన్నివేశాలు, ఎపిసోడ్లు సామజిక వర్గాలను, ప్రభుత్వాలను టార్గెట్ చేసేలా ఉన్నాయట. వాస్తవాలే చూపించినా వాటి వల్ల మనోభావాలు దెబ్బతింటాయని భావించిన సెన్సార్ అధికారులు కొన్ని అబ్జెక్షన్స్ చెప్పారట.

ఇదంతా అఫీషియల్ గా చెప్పలేదు కానీ అంతర్గత వర్గాలు చెబుతున్న దాని ప్రకారం మ్యాటర్ కొంచెం సీరియస్ గానే ఉంది. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల దుస్తుల గురించి శివాజీ చేసిన కామెంట్స్ ఆల్రెడీ రచ్చ చేస్తున్నాయి. ఏకంగా మహిళా కమీషన్ సీరియస్ అయ్యేదాకా వ్యవహారం వెళ్ళింది. ఇది దండోరాకు కొంచెం మైనసయ్యేలా ఉంది.