ఆమెకు పెళ్లయిపోయింది.. విశాల్ సంగతేంటో?

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో స్నేహితుల బృందంలో ఒకరిగా కనిపించిన అనీశా రెడ్డితో తెలుగువాడైన తమిళ హీరో విశాల్ గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి జరిగిన ఆ ఈవెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ వీరి కలయిక ఎంత ఆశ్చర్యపరిచిందో.. నిశ్చితార్థం తర్వాత ఇద్దరూ విడిపోయినట్లు వార్తలు రావడం కూడా అంతే ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎంగేజ్మెంట్ జరిగిన కొంత కాలానికి ఆ ఈవెంట్ ఫొటోలన్నింటినీ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అనీశా తొలగించేయడంతో ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థమైంది. తర్వాత వీరి పెళ్లి గురించి సమాచారమే లేకపోయింది. దీని గురించి అనీశా కానీ, విశాల్ కానీ మాట్లాడలేదు. కాగా వీళ్లిద్దరూ విడిపోయిన విషయం ఇప్పుడు అధికారికంగా రూఢి అయింది. అనీశా పెళ్లి వేరే వ్యక్తితో జరిగిపోయింది.

హైదరాబాద్‌కే చెందిన ఓ వ్యాపార వేత్తతో అనీశా పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి విశాల్‌ నుంచి అనీశా ఎప్పుడో విడిపోయి మూవ్ ఆన్ అయిపోయిందని స్పష్టమవుతోంది. మరి వీరి మధ్య ఎందుకు విభేదాలొచ్చాయన్నది తెలియదు. విశాల్ వయసు ఇప్పటికే 43 ఏళ్లకు చేరడం గమనార్హం. అతడి పెళ్లి గురించి దశాబ్దం కిందట్నుంచి వార్తలొస్తున్నాయి.

సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయురాలైన వరలక్ష్మితో అతను ప్రేమలో ఉన్నట్లు, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్నేళ్ల ముందు గట్టి ప్రచారమే జరిగింది. ఇద్దరూ సన్నిహితంగా కనిపించి ఆ వార్తలకు బలం చేకూర్చారు కూడా. కానీ తర్వాత వీరి మధ్య ఎందుకో అంతరం వచ్చింది. ఇంతలో విశాల్ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని ఆశ్చర్యపరిచాడు. కానీ ఆ బంధం నిలవలేదు. మరి వయసు మీదపడ్డ విశాల్ ఎప్పటికైనా అసలు పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకం.