గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో భలే హైలైట్ అయింది భాగ్యశ్రీ. సినిమా విడుదల కావడానికి ముందే ఆమెకు మంచి హైప్ కూడా వచ్చింది. అవకాశాలు వరుస కట్టాయి. ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్ అయినా సరే.. ఆమె బిజీ హీరోయిన్ అయిపోయింది. కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా.. ఇలా వరుసగా భాగ్యశ్రీ సినిమాలు రిలీజయ్యాయి. కానీ ఇవేవీ ఆశించిన విజయాలు సాధించలేదు.
ఐతే మిస్టర్ బచ్చన్, కింగ్డమ్ సినిమాలను పక్కన పెడితే.. కాంత, ఆంధ్ర కింగ్ తాలూకాలో భాగ్యశ్రీ అన్ని విధాలా మెప్పించింది. తన అందంతో ఆకట్టుకోవడమే కాదు.. నటనతోనూ మెప్పించింది. ఆమెను జస్ట్ గ్లామర్ డాల్ అనడానికి లేదు. ప్రమోషన్ల పరంగానూ ఆమె ప్రతి సినిమాకూ బాగా సహకరిస్తుండడంతో భాగ్యశ్రీకి అవకాశాలేమీ ఆగడం లేదు. ఆల్రెడీ తెలుగులో లెనిన్ మూవీ చేస్తున్న భాగ్యశ్రీ.. తాజాగా టాలీవుడ్ నుంచి మరో మంచి అవకాశం అందుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగులో హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన స్వప్న సినిమాస్లో భాగ్యశ్రీ ఒక సినిమా చేయబోతోంది. అది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడమే అతి పెద్ద విశేషం. రమేష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడట. చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా అనే వెరైటీ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇదొక ప్రయోగాత్మక కథతో తెరకెక్కనున్నట్లు సమాచారం.
హీరోయిన్లు సాధారణంగా పెద్ద స్టార్లుగా ఎదిగాకే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటారు. నిర్మాతలు కూడా అప్పుడే ధైర్యం చేస్తుంటారు. కానీ భాగ్యశ్రీ కథానాయికగా పరిచయం అయిన ఏడాదిన్నర లోపే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి రెడీ అయిపోయింది.
ఇలాంటి సినిమాలు చేయాలంటే నటిగా మంచి నైపుణ్యం ఉండాలి. కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాలతో ఆమె తన నట కౌశలాన్ని చూపించింది. తన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ యూత్లో భాగ్యశ్రీకి మంచి క్రేజ్ ఉంది. తన గ్లామర్కు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆమె మీద నమ్మకంతో లేడీ ఓరియెంటెడ్ చేయడానికి రెడీ అయినట్లున్నారు మేకర్స్. బహు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుందట.
Gulte Telugu Telugu Political and Movie News Updates