ఆసియా కప్లో పాకిస్థాన్పై భారత్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ విచారణ జరిపింది. ఆ సమయంలో ఆయన పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నామంటూ, గెలుపును భారత సైన్యానికి అంకితం చేస్తున్నామంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐసీసీ అధికారికంగా హియరింగ్ నిర్వహించింది.
ఈ విచారణకు సూర్యకుమార్తో పాటు బీసీసీఐ సీఓఓ హేమాంగ్ ఆమిన్, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ సమర్ మల్లాపుర్కర్ హాజరయ్యారు. రిచీ రిచర్డ్సన్ అధ్యక్షతన ఈ హియరింగ్ జరిగింది. సూర్యకు ఎలాంటి శిక్ష విధించాలన్నది ఇంకా స్పష్టత రాకపోయినా, లెవల్ 1 కింద ఈ ఘటనకు వార్నింగ్ ఇవ్వడం లేదా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రూప్ స్టేజ్లో పాక్పై గెలుపు సాధించిన తర్వాత సూర్య, “ఈ గెలుపును పహల్గాం బాధిత కుటుంబాలకు అంకితం చేస్తున్నాం. భారత ఆర్మీ చేసిన త్యాగం, ధైర్యసాహసం ఎప్పటికీ మరువలేం. వారికి మద్దతుగా ఎప్పుడూ ఉంటాం. వాళ్లు చూపిన ధైర్యమే మాకు ప్రేరణ” అని స్పష్టంగా వ్యాఖ్యానించారు. ఇదే పాక్ మీడియా, బోర్డు అసహనానికి కారణమైందని తెలుస్తోంది.
ఇక ఈ వ్యవహారంతోపాటు మరో విచారణను కూడా ఐసీసీ చేపట్టనుంది. భారత్తో మ్యాచ్లో పాక్ బ్యాటర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత చేసిన ‘గన్ సెలబ్రేషన్’, అలాగే హారిస్ రవూఫ్ చేసిన ‘6, 0’ సైగలపై బీసీసీఐ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలు రెచ్చగొట్టే ప్రవర్తన కింద పరిగణించబడ్డాయి. అందువల్ల వారిద్దరినీ ఐసీసీ రిఫరీ రిచర్డ్సన్ ఎదుట వాదనలు వినిపించాల్సి రావచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates