టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘మిరాయ్’ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఒకటి అనడంలో సందేహం లేదు. మన పురాణాలు, ఇతిహాసాల గొప్పదనాన్ని చెబుతూ.. కథా నేపథ్యాన్ని వివరించిన తీరు ప్రభాస్ అభిమానులనే కాక సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ప్రభాస్ తన సినిమాలకు చెప్పే డబ్బింగ్ కంటే ఇది బాగుందని.. వాయిస్లో ఏదో విశేషం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మామూలుగా కొంచెం పట్టి పట్టి, నెమ్మదిగా డైలాగ్ చెబుతాడు ప్రభాస్. కానీ ఇందులో మాత్రం డైలాగుల్లో స్పీడ్ ఉంది. దీంతో ఇది ప్రభాస్ ఒరిజినల్ వాయిసేనా అన్న సందేహాలు కలిగాయి. దీని వెనుక ఏఐ ఉందనే చర్చ కూడా జరిగింది. ప్రభాస్ అనుమతితో ఏఐ ద్వారా అతడి వాయిస్ను రీక్రియేట్ చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది.
ఐతే ఈ ప్రచారాన్ని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఖండించాడు. ప్రభాస్ సొంతంగానే ‘మిరాయ్’ కోసం డబ్బింగ్ చెప్పాడని.. అందులో వినిపించిన ప్రతి మాటా ప్రభాస్ గొంతు నుంచి వచ్చిందే అని కార్తీక్ స్పష్టం చేశాడు. కాకపోతే టెక్నాలజీని ఉపయోగించి వాయిస్లో కొంచెం స్పీడు మాత్రం పెంచామని వెల్లడించాడు కార్తీక్. వాయిస్ ఓవర్ రన్ టైం తగ్గించడానికి ఈ పని చేసి ఉండొచ్చు.
దీంతో ప్రభాస్ వాయిస్ ఓవర్ విషయంలో ఏఐ ఊహాగానాలకు తెరపడిపోయింది. ఏదేమైనప్పటికీ.. ప్రభాస్ సొంత చిత్రాల కంటే ఇందులో తన డైలాగ్ డెలివరీ బాగుందనే ఫీడ్ బ్యాక్ మాత్రం జనాల నుంచి వచ్చింది. ప్రభాస్ ఎంత పెద్ద స్టార్గా ఎదిగినా.. తన డైలాగ్ డెలివరీ విషయంలో విమర్శలు మాత్రం ఆగట్లేదు. కొంచెం స్పీడు పెంచితే తన వాయిస్ ఇంత బెటర్ అవుతుందా అని ఇప్పుడు ప్రేక్షకులు చర్చించుకుంటారనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates