కియారా అద్వానీకి అయిదో షాక్

అందం, హిట్లు రెండు ఉన్న లక్కీ హీరోయిన్ గా మొన్నటిదాకా మంచి ఊపు మీదున్న కియారా అద్వానీకి బాక్సాఫీస్ వద్ద వరస షాకులు తగులుతున్నాయి. ఒకటి రెండు ఏకంగా అయిదు ఫ్లాపులు క్యూ కట్టడంతో పారితోషికం పరంగా నెలకొన్న డిమాండ్ క్రమంగా తగ్గిపోయేలా ఉంది. చివరి సక్సెస్ తనకు 2022లో ‘భూల్ భులయ్యా 2’తో దక్కింది. దాని విజయంలో హీరో కార్తీక్ ఆర్యన్ దే ప్రధాన పాత్ర అయినప్పటికీ కియారాకు కూడా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కామెడీ ఎంటర్ టైనర్ ‘జగ్ జగ్ జియో’ అంతంతమాత్రంగానే ఆడింది. ఎన్నో వాయిదాలు పడుతూ వచ్చిన విక్కీ కౌశల్ ‘గోవిందా మేరా నామ్’ ఫలితం కూడా సోసోనే.

మొన్నటి ఏడాది ‘సత్యప్రేమ్ కీ కథ’ కొన్ని ఏ సెంటర్స్ ఓ మోస్తరుగా ఆడినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే నిరాశే కలిగించింది. నిన్న జనవరిలో రిలీజైన ‘గేమ్ ఛేంజర్’ గురించి చెప్పనక్కర్లేదు. వినయ వినయ విధేయ రామ కాంబోని రిపీట్ చేస్తూ రామ్ చరణ్ కి జోడి కడితే రిజల్ట్ కూడా మళ్ళీ పునరావృత్తమయ్యింది. తాజాగా వార్ 2 ఏమాయ్యిందో కళ్ళముందు కనిపిస్తోంది. బికినీ షాట్ తప్ప తన గురించి మాట్లాడుకోవడానికి ఏం లేకుండా పోయింది. పెర్ఫార్మన్స్ కోసమన్నట్టు ఓ రెండు ఫైట్లు, ఎమోషనల్ సీన్లు పెట్టారు కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తన చేతిలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ యష్ చేస్తున్న టాక్సిక్ ఒకటే.

ఇటీవలే తల్లి హోదాలోకి ప్రవేశించిన కియారా అద్వానీ కొంత గ్యాప్ తీసుకుని కెరీర్ మీద మళ్ళీ ఫోకస్ పెంచబోతోంది. గ్లామర్ షోకు ఏ మాత్రం మొహమాటపడనని వార్ 2 లో చెప్పేసింది కనక ఆ కోణంలో వాడుకునేందుకు దర్శకులు రెడీ అవుతున్నారు. కెరీర్ ప్రారంభంలో భరత్ అనే నేను, కబీర్ సింగ్, ఎంఎస్ ధోని లాంటి వరస సక్సెస్ లు చూశాక ఇప్పుడిలా ఫ్లాపులు రావడం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. విచిత్రం ఏంటంటే వార్ 2లో ఇద్దరు పెద్ద హీరోలున్నా హీరోయిన్ కం ప్రధానంగా కనిపించే లేడీ క్యారెక్టర్ కియారా అద్వానీ ఒక్కటే. అయినా కూడా ఫలితం దక్కపోవడం బ్యాడ్ లక్ కాక ఇంకేమిటి.