తేడా కొట్టింది తారక్ ఒక్కడికే కాదు

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ వార్ 2 ఇంత ప్రతికూల ఫలితం అందుకుంటుందని ఎవరూ ఉహించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్, నాగవంశీ మాటలు విన్నాక అభిమానులు తమ నమ్మకాన్ని రెట్టింపు చేసుకున్నారు. తీరా చూస్తే నిరాశే మిగిలింది. ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన యాంగిల్ ఒకటుంది. తెలుగులో పెద్ద స్టార్ హీరోలు స్ట్రెయిట్ గా హిందీ సినిమాలు చేయడం ఎప్పుడూ కలిసి రాలేదు. చిరంజీవికి తొంబై దశకంలో ప్రతిబంద్, ఆజ్ కా గూండారాజ్ మంచి హిట్లు ఇవ్వగా ది జెంటిల్ మెన్ దెబ్బకు మళ్ళీ ఆయన అటువైపు వెళ్ళలేదు. శివ సక్సెస్ తర్వాత ద్రోహి డిజాస్టర్ కావడంతో నాగార్జున సీరియస్ ఫోకస్ పెట్టలేదు.

ఆనారి విజయవంతమైన తక్ధీర్వాలా తేడా కొట్టడంలో వెంకటేష్ బుద్దిగా తెలుగు మార్కెట్ వైపుకు వచ్చేశారు. ఇలా ఒకటి రెండు ప్రయత్నాలు చేసి సైలెంట్ అయిన టయర్ 1 స్టార్లు వీళ్ళు. బాలకృష్ణ ఒక్కరే వీటి జోలికి వెళ్ళలేదు. ఆఫర్లు వచ్చినా పూర్తిగా టాలీవుడ్ కే అంకితమవ్వాలనే ఉద్దేశంతో హిందీ దర్శకులకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పటి జనరేషన్ లో రామ్ చరణ్, ప్రభాస్ లు ఒకసారి ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. ఇంత ఇమేజ్ వచ్చినా అల్లు అర్జున్ ఇప్పటికీ సౌత్ దర్శకులకే ఓటు వేస్తున్నాడు కానీ ముంబై నుంచి ఎన్ని కాల్స్ వచ్చినా లైట్ తీసుకుంటున్నాడు. మహేష్ బాబు కూడా అంతే.

సో వీళ్ళ తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్రయిల్ వేశాడు తప్పించి వార్ 2తో ఏదో పాతుకుపోదామని కాదు. ఇక్కడ ఇంత ఫాలోయింగ్ పెట్టుకుని లేనిపోని నార్త్ మార్కెట్ మీద ఆశలు పెట్టుకుంటే ఎంత ప్రమాదమో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు బాగా తెలుసు. హిందీ ఛత్రపతి కోసం మూడేళ్లు వృథా చేసుకుంటే దక్కింది సున్నా. దెబ్బకు ఇక్కడ మార్కెట్ తగ్గించుకోవాల్సి వచ్చింది. రామ్ కు ఆఫర్లు వచ్చినా తెలివిగా వద్దనుకుని మంచి పని చేశాడు. కాకపోతే వార్ 2లో తన క్యారెక్టరైజేషన్ ను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ పొరపాటు చేశాడు తప్పించి కావాలని కాదనేది ఫ్యాన్స్ కామెంట్.