తమన్ డబుల్ డ్యూటీకి స్పీకర్లు బద్దలే

టాలీవుడ్ మరో బిగ్గెస్ట్ క్లాష్ కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25 నువ్వా నేనా అంటూ అఖండ 2, ఓజి రెండు కవ్వించుకోవడానికి సిద్ధపడటం బయ్యర్లను ఒకపక్క ఆనందానికి గురి చేస్తూనే ఇంకోవైపు ఆందోళన కలిగిస్తోంది. చాలా క్రేజ్ ఉన్న రెండు సినిమాలు కావడంతో ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయని టెన్షన్ పడుతున్నారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే బాలయ్య, పవన్ కళ్యాణ్ కెరీర్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీస్ ఇవి. అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ వీటి మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. అలాంటప్పుడు ఒకరివల్ల మరొకరు ఎఫెక్ట్ అవ్వాలని కోరుకోరు.

ఇదిలా ఉండగా అఖండ 2, ఓజి రెండింటికి తమనే సంగీత దర్శకుడు. అఖండ మొదటి భాగం వచ్చిన టైంలో పలు థియేటర్లలో సౌండ్ బాక్సులు డ్యామేజ్ కావడం గురించి సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. యుఎస్ లో ఏకంగా బాస్ తగ్గించి మరీ షోలు వేయాల్సి వచ్చిందంటే విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతకు మించి అఖండ 2 ఉంటుందని తమన్ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. ఫస్ట్ హాఫ్ కే పైసా వసూలు అయిపోతుందని, ఆపై చూసేదంతా బోనస్ అంటూ ఓ రేంజ్ లో ఊరించాడు. స్వయంగా బాలయ్యే నందమూరి తమన్ అని నామకరణం చేయడం తెలిసిందే.

ఇక ఓజిది మరో కథ. పవన్ కళ్యాణ్ కి గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రోలు కంపోజ్ చేసినా అవన్నీ రీమేకులు కావడంతో తమన్ కు బెస్ట్ ఇచ్చే అవకాశం పూర్తి స్థాయిలో దొరకలేదు. కానీ ఇప్పుడు ఓజి అలా కాదు. నెక్స్ట్ లెవెల్ గ్యాంగ్ స్టర్ మాస్ ఇది. ఫ్యాన్స్ ఎంత ఆకలితో ఎదురు చూస్తున్నారో వర్ణించడం కష్టం. తమన్ కూడా పలు ఇంటర్వ్యూలలో మాములు ఎలివేషన్లు ఇవ్వలేదు. పాటలు విన్నవాళ్ళు చెబుతున్న వాళ్ళ ప్రకారం ఆల్బమ్ ఓ రేంజ్ లో వచ్చిందట. సో సెప్టెంబర్ 25 పక్క పక్క థియేటర్లలో అఖండ 2, ఓజి ఆడుతుంటే అవి చూసేవాళ్ళు తప్ప ఆ చుట్టపక్కకు ఇతరులు వెళ్ళకపోవడం సేఫ్.