చిరు లేడు.. అయినా ‘ఆచార్య’ ఆగలేదు

కరోనా విరామం తర్వాత టాలీవుడ్ స్టార్లలో అందరి కంటే లేటుగా షూటింగ్‌కు సిద్ధమైంది మెగాస్టార్ చిరంజీవే. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోపే మళ్లీ షూటింగ్‌లు మొదలుపెట్టడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల పెద్దల్ని కలిసిన చిరు.. మిగతా హీరోలంతా రంగంలోకి దిగాక కూడా పని మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

ఎట్టకేలకు ఈ సోమవారం ‘ఆచార్య’ చిత్రీకరణ పున:ప్రారంభించడం కోసం ఆయన ప్రణాళికలు రచించుకున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ తీరా చూస్తే చిరంజీవి కరోనా బారిన పడ్డారన్న వార్త బయటికి వచ్చింది. ‘ఆచార్య’ కోసమనే కరోనా టెస్టు చేయించుకుంటే ఆయనకు పాజిటివ్ వచ్చింది. పెద్దగా లక్షణాలు లేకపోవడంతో చిరు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఐతే చిరు అందబాటులో లేకపోయినా ‘ఆచార్య’ షూటింగ్ మాత్రం ఆగకపోవడం విశేషం.

అనుకున్న ప్రకారమే సోమవారం ‘ఆచార్య’ చిత్రీకరణ పున:ప్రారంభించారు. చిరు నుంచి సమాచారం అందగానే ప్రొడక్షన్ టీం ప్రణాళికలు మార్చుకుంది. ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసుకుంది. ఈ మేరకు ఆర్టిస్టుల డేట్లు సర్దుబాటు చేసుకున్నారు. చిరు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం పడకపోవచ్చని.. ఆయన రెండు వారాల్లో కోలుకుని షూటింగ్‌కు వస్తారని ఆశిస్తోంది చిత్ర బృందం. ఈలోపు ఆయన లేని సన్నివేశాలన్నీ పూర్తి చేస్తారు.

చిరు వచ్చే సమయానికి అందరి డేట్లు సర్దుబాటు చేసి పక్కా ప్లాన్‌తో రెడీగా ఉంటారు. ఆయన రాగానే ఆ సన్నివేశాల చిత్రీకరణ సాగుతుంది. ఏదేమైనప్పటికీ వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేసి తీరాలన్న పట్టుదలతో చిత్ర బృందం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ నటించనున్న ఈ చిత్రానికి మణిరత్నం సంగీతాన్నందిస్తున్నాడు.