తెలుగోళ్లకు కొత్త మలయాళం స్టార్ దొరికాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవంలో ఎక్కువ ప్రయోజనం పొందిన ఇండస్ట్రీ అంటే మాలీవుడ్ అనే చెప్పాలి. ఎప్పట్నుంచో గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నప్పటికీ.. మలయాళం ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది, అక్కడి సినిమాల విలువ అందరికీ తెలిసిందీ కరోనా తర్వాతే. భాషా భేదం లేకుండా అందరూ మలయాళ సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు మలయాళ హీరోలు ఓటీటీల ద్వారానే వేరే భాషల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు.

తెలుగులో అలా ఆదరణ పెంచుకున్న హీరోల్లో ముందు వరుసగా టొవినో థామస్ పేరు చెప్పుకోవాలి. ఆహా సహా పలు ఓటీటీల ద్వారా అతడి సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. కేవలం ఓటీటీ సినిమాలతోనే అతను ఇక్కడ మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు. 2018, ఏఆర్ఎం లాంటి సినిమాలకు థియేటర్లలోనూ ఆదరణ దక్కడానికి ఈ ఫాలోయింగే కారణం. ఐతే ఈ మధ్య టొవినో జోరు కొంచెం తగ్గింది. ఆ సమయంలో మరో మలయాళ స్టార్ తెలుగులో సూపర్ ఫాలోయింగ్ సంపాదించాడు. అతనే.. బాసిల్ జోసెఫ్.

తెలుగులో ఈ మధ్య బంపర్ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ హీరోగా బాసిల్ జోసెఫ్ పేరే చెప్పుకోవాలి. జయ జయ జయ జయహే, నూనాక్కుళి, సూక్ష్మ దర్శిని, గురువాయూర్ అంబలనదాయిల్, ప్రవిన్‌కుడు షాపు.. ఇలా పలు చిత్రాలతో బాసిల్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. ఈ మధ్యే వచ్చిన పొన్ మ్యాన్ అతడి ఫాలోయింగ్‌ను ఇంకా పెంచింది. లేటెస్ట్‌గా ‘మరణ మాస్’ అనే బ్లాక్ కామెడీతో అతను ఆకట్టుకుంటున్నాడు.

బాసిల్ ఎంచుకునే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు, అతడి నటన మన వాళ్లకు తెగ నచ్చేస్తున్నాయి. అతనో సినిమా చేశాడు అంటే అది చాలా స్పెషల్‌గా ఉంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో బలపడుతోంది. ఎక్కువగా బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలు చేసే బాసిల్‌తో మన వాళ్లు బాగా కనెక్ట్ అవుతున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా అతను బాగా పండిస్తున్నాడు. తన సినిమాలన్నీ చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటున్నాయి. తెలుగు ఓటీటీల్లో అతనో స్టార్‌గా ఎదిగిపోయాడు అంటే అతిశయోక్తి కాదు. విశేషం ఏంటంటే.. బాసిల్ మంచి అభిరుచి ఉన్న దర్శకుడు కూడా. ‘మిన్నల్ మురళి’ సహా మూడు సినిమాలు తీశాడు. తెలుగువాళ్లు దత్తపుత్రుడిగా భావించే సూర్యతో అతను త్వరలోనే సినిమా తీయబోతుండడం విశేషం.