ఎక్స్‌క్లూజివ్: పూరి సినిమాలో పెరుసు హీరోయిన్

ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో బాగా ట్రెండ్ అయిన సినిమా.. పెరుసు. లెజెండరీ తెలుగు డైరెక్టర్ కోదండరామిరెడ్డి తనయులు వైభవ్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ప్లాట్ పాయింట్ అడల్ట్ టచ్ ఉన్నదే అయినా.. హద్దులు దాటని కామెడీతో ఈ సినిమాను భలేగా నడిపించి మెప్పించింది చిత్ర బృందం. తమిళంతో పాటు వేరే భాషల వాళ్లూ ఈ సినిమాను బాగా చూశారు. ఈ చిత్రంలో వైభవ్‌కు జోడీగా నటించి మెప్పించిన అమ్మాయి నిహారిక ఎన్ఎం. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఈ అమ్మాయి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇన్‌స్టాలో ఏకంగా 35 మిలియన్ల ఫాలోవర్లున్నారు ఆ అమ్మాయికి. గతంలో మహేష్ బాబు సైతం ఈ అమ్మాయితో కలిసి తన ప్రొడక్షన్లో వచ్చిన ‘మేజర్’ మూవీని ప్రమోట్ చేయడం విశేషం. ఇప్పుడు నిహారిక ఒక పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది పూరి జగన్నాథ్ కావడం విశేషం.

విజయ్ సేతుపతి హీరోగా పూరి ఇటీవలే ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సేతుపతికి జోడీగా అనేక పేర్లను పరిశీలించిన చిత్ర బృందం.. చివరికి నిహారికను ఎంపిక చేసినట్లు సమాచారం. ‘పెరుసు’ సినిమాలో నిహారిక పెర్ఫామెన్స్ నచ్చి ఆమెను పిలిచి ఆడిషన్ చేసింది చిత్ర బృందం. అందులో ఇంప్రెస్ చేయడంతో ఆమెనే ఫైనలైజ్ చేశారట. ఇందులో అన్నీ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే ఉంటాయని.. నిహారికది కూడా అలాంటి పాత్రే అని సమాచారం. తన కెరీర్‌ను మలుపు తిప్పే సినిమాగా ఇది నిలవడం ఖాయం అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రాధికా ఆప్టే నటిస్తోందనే వార్తలు నిజం కాదని తెలిసింది. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.