నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ థియేటర్ల పరిస్థితి ఘోరంగా ఉందని, జనాలు రావడం లేదని, తాను స్వయంగా రెండు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తిరిగి ప్రత్యక్షంగా గమనించి ఇది చెబుతున్నానని అన్నారు. ఆడియన్స్ ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని, సెకండ్ షోలు వేయడం దాదాపు మానేశారని, సాయంత్రం కొంచెం పర్వాలేదనిపించేలా నడుస్తున్నాయని వివరించారు. ఈ దుస్థితి స్టార్ హీరోలకు సైతం తప్పడం లేదని, పబ్లిక్ వచ్చి టికెట్లు కొంటేనే తాము అన్నం తినగలమంటూ ఆవేదన వెలిబుచ్చారు.
త్రినాథరావు వ్యక్తపరిచింది ముమ్మాటికీ నిజం. ముఖ్యంగా బంగారం లాంటి సమ్మర్ సీజన్ లో సైతం థియేటర్లు ఖాళీగా ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు. అయితే ఇక్కడ ప్రాక్టికల్ కోణంలో చూడాల్సిన అంశాలు కొన్నున్నాయి. ప్రేక్షకులు ఎప్పుడు సినిమాలను వెండితెర మీద చూసేందుకు ముందుంటారు. కాకపోతే మారిన ట్రెండ్ లో, ఓటిటి జమానాలో ఆషామాషీ కంటెంట్ తో పని జరగడం లేదు. మూడు వందల కోట్లతో తీసిన గేమ్ ఛేంజర్ కన్నా యాభై కోట్లకే పూర్తయిన సంక్రాంతికి వస్తున్నాంకి బ్రహ్మరథం దక్కింది. కోర్ట్, మ్యాడ్ స్క్వేర్లు అసలు స్టార్లే లేకుండా ఘనవిజయం సాధించి బయ్యర్లందరికీ లాభాలిచ్చాయి.
సో బాగా తీస్తే ఆదరణ అందించేందుకు పబ్లిక్ సిద్ధంగా ఉన్నారనేది ఓపెన్ ఫాక్ట్. దాన్ని గుర్తించాలి. అంతదాకా ఎందుకు ఇదే త్రినాథరావు తీసిన మజాకా ఎందుకు ఆడలేదనేది అందరికీ తెలిసిన విషయమే. వర్కవుట్ కాని ఏజ్ బార్ తండ్రి ప్రేమకథని అవసరానికి మించి సాగదీయడంతో ఆ కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేకపోయారు. కల్కి, దేవర, పుష్ప 2, బలగం ఇలా ఏది చూసుకున్నా చిన్నా పెద్దా లేకుండా బాగున్నవాటికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. యావరేజ్, బిలో యావరేజ్ కంటెంట్లకు కాలం చెల్లిన రోజుల్లో హాలుకు వచ్చిన వాళ్లకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తే తప్ప కొత్త సినిమాలకు టికెట్లు తెగడం కష్టం.