మళ్లీ ‘రంగ్ దే’ కాంబో?

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే.. అందులో హీరో హీరోయిన్ల జంట అందరినీ ఆకట్టుకుంటుంది. వాళ్లను సక్సెస్ ఫుల్ పెయిర్‌గానే చూస్తారు. నితిన్, కీర్తి సురేష్‌లది అలాంటి జంటే అని చెప్పాలి. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘రంగ్ దే’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ మూవీలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగా పండింది. ప్రమోషన్లలో కూడా ఈ జంట హుషారుగా కనిపించింది. ఇద్దరూ మంచి కెమిస్ట్రీతో సినిమాను ప్రమోట్ చేశారు. సినిమాలో కూడా ఇద్దరి మధ్య సన్నివేశాడు బాగానే పండాయి. పాటల్లో కూడా ఈ జంట చూడముచ్చటగా కనిపించింది.

కానీ సినిమా సరిగా ఆడకపోవడంతో మళ్లీ ఈ కాంబినేషన్ చూసే అవకాశం ప్రేక్షకులకు రాలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా వీళ్లిద్దరూ మళ్లీ జంట కట్టబోతున్నారన్నది తాజా సమాచారం. నితిన్ హీరోగా ‘బలగం’ వేణు దర్శకత్వంలో ‘యల్లమ్మ’ సినిమా త్వరలోనే మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ముందు నానితో అనుకున్నాడు వేణు. కానీ అది కుదరక నితిన్‌తో చేస్తున్నాడు. ఈ చిత్రానికి కథానాయికగా కూడా ముందు అనుకున్నది వేరొకరిని. సాయిపల్లవిని నటింపజేయాలని చూశారు. కానీ ఆమెకు డేట్లు సర్దుబాటు చేయడం కుదర్లేదు. దీంతో ఇప్పుడు కీర్తిని ట్రై చేస్తున్నారట.

ఆమె దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో మళ్లీ ‘రంగ్ దే’ జోడీని చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే రగ్డ్ మూవీ అని సమాచారం. ‘దసరా’ స్టయిల్లో ఉంటుందట. హీరో హీరోయిన్లిద్దరూ డీగ్లామరస్ రోల్స్‌లో కనిపిస్తారట. ‘రంగ్ దే’లో చాలా అందంగా కనిపించిన జంట.. ఈసారి భిన్న అవతారాల్లో కనిపించనుందన్నమాట. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. వేసవిలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రావచ్చు.