మంచు విష్ణు కెరీర్ లో బెస్ట్ ఎంటర్ టైనర్ ఏదంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఢీ కొట్టి చూడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 2007లో విడుదలైన ఈ నవ్వుల బొనాంజా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచి క్లాసు మాసు రెండు వర్గాలను మెప్పించింది. థియేటర్లలో చూసి పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో దీని క్లిప్స్ లెక్కలేనన్ని వాడుతూనే ఉంటారు. అలాంటి ఫన్ ని మరోసారి రీ రిలీజ్ రూపంలో థియేటర్లకు తీసుకొస్తున్నారు. మార్చి 28 మళ్ళీ మిమ్మల్ని నవ్వుల వర్షంలో ముంచెత్తుతామని విష్ణు అఫీషియల్ గా ప్రకటించాడు. కాకపోతే ఇక్కడో చిక్కు లేకపోలేదు.
మార్చి 28 రెండు కొత్త సినిమాలు కాచుకుని ఉన్నాయి. నితిన్ ‘రాబిన్ హుడ్’ని పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది మైత్రి. ప్రమోషన్లు మెల్లగా ఊపందుకుంటున్నాయి. శ్రీలీల హీరోయిన్ గా నటించగా సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డున్న వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అదే రోజు ‘మ్యాడ్ స్క్వేర్’ దిగుతోంది. క్రేజీ సీక్వెల్ గా సితార బ్యానర్ చేస్తున్న మార్కెటింగ్ మాములుగా లేదు. ఇంకో వారం రోజుల్లో దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళబోతున్నారు ముందు రోజు మార్చి 27 విక్రమ్ ‘వీరధీర శూర పార్ట్ 2’ వస్తుంది. తెలుగు హక్కులకు సంబంధించిన డీల్స్ ఒక కొలిక్కి వస్తున్నాయి. త్వరలో అనౌన్స్ మెంట్ ఉంటుంది.
మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ సేమ్ డేట్ దిగుతోంది. సో మొత్తం నాలుగు క్రేజీ సినిమాలు బరిలో ఉన్నప్పుడు ఢీని రీ రిలీజ్ చేయడం సరైన నిర్ణయం కాదేమోనని మూవీ లవర్స్ ఫీలవుతున్నారు. ఎందుకంటే యూత్, ఫామిలీస్ ఇద్దరూ ఎంజాయ్ చేసే కంటెంట్ ఇందులో ఉంది. విష్ణు ఫాలోయింగ్ సంగతి పక్కనపెడితే ఢీని థియేటర్లో ఎంజాయ్ చేసే జనాలు మాత్రం భారీగా ఉంటారు. కాకపోతే సరిపడా థియేటర్లు, షోలు ఉంటే నాలుగైదు రోజులు మంచి వసూళ్లతో పాటు రన్ దక్కుతుంది. మరి తర్వాతేమైనా నిర్ణయం మార్చుకుంటారో లేక కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు దూసుకెళ్లిపోతాం అంటారో చూడాలి.