నయనతార పూజకు వచ్చినా సంచలనమే

ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా, హీరో ఎవరైనా తాను సినిమా ఒప్పుకుంటే ఓపెనింగ్, ప్రమోషన్లకు నయనతార ససేమిరా నో చెబుతుందనే విషయం అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే ఇవాళ జరిగిన మూకుతి అమ్మన్ 2 (అమ్మోరు తల్లి) ప్రారంభోత్సవానికి విచ్చేయడం అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం ఈ పూజా కోసమే నిర్మాత కోటి రూపాయలు ఖర్చు పెట్టి సెట్ వేశాడంటే ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. మీనా, రెజీనా తదితరులు గెస్టులుగా హాజరు కాగా కోలీవుడ్ లో వందకు పైగా ప్రముఖులకు ఖరీదైన ఇన్విటేషన్లు వెళ్లాయి. వాళ్ళెవరూ రాలేదు కానీ పిలుపుల వీడియోలు వైరలయ్యాయి.

అమ్మోరు తల్లి మొదటి భాగం హాట్ స్టార్ ద్వారా డైరెక్ట్ ఓటిటిలో రిలీజయ్యింది. ఆర్జె బాలాజీ దర్శకత్వం వహించగా భారీ స్పందన దక్కించుకుని డిజిటల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే దీని సీక్వెల్ రూపొందించే విషయంలో నిర్మాతతో అభిప్రాయభేదాలు రావడంతో బాలాజీ తప్పుకుని సూర్య హీరోగా వేరే సినిమాకు వెళ్ళిపోయాడు. ఈయన స్థానంలో అరణ్మయి డైరెక్టర్ సుందర్ సి ముప్పై రోజుల్లో స్క్రిప్ట్ సిద్ధం చేసి వంద కోట్ల బడ్జెట్ అడిగేశాడు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నిర్మాత గణేష్ దానికి ఎస్ అనేశారు. ప్యాన్ ఇండియా భాషల్లో భారీ ఎత్తున ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తానని ప్రకటించారు.

ఇంత పెద్ద స్కేల్ కాబట్టే నయనతారకు రావడం మినహా మరో ఆప్షన్ లేకుండా పోయింది. టైటిల్ రోల్ తనదే. పైగా ఆమె లేకుండా ఓపెనింగ్ చేస్తే కామెడీ అయిపోతుంది. దీనికి తోడు ప్రొడ్యూసర్ పెట్టిన కళ్లుచెదిరే ఖర్చు. దెబ్బకు రాజీపడక తప్పలేదు. ఇటీవలే లేడీ సూపర్ స్టార్ బిరుదు వాడొద్దని నయన్ సోషల్ మీడియాలో లెటర్ పెట్టిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ధనుష్ తో వివాదం వల్ల నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కేసులో పోరాడుతున్న నయనతార ఈ మధ్య బయట బాగానే దర్శనమిస్తోంది. ఇదంతా ఓకే కానీ దెయ్యాల సినిమా స్పెషలిస్టుగా పేరు పొందిన సుందర్ సి ఈ దేవత కథని ఎలా తెరకెక్కిస్తాడో.