దేవి అదొక్క పాటకు ‘ఎస్’ చెప్పి ఉంటే

తండేల్ థియేట్రికల్ రన్ మూడో వారంలోకి అడుగుపెట్టాక బాగా నెమ్మదించిన తరుణంలో సెకండాఫ్ లో ఉండాల్సిన ఒక ముఖ్యమైన పాటను వద్దనుకోవడం గురించి దర్శకుడు చందూ మొండేటి ఒక తాజా ఇంటర్వ్యూలో బయట పెట్టడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. చైతుతో పాటు మొత్తం ఇరవై రెండు మంది పాకిస్థాన్ జైలుకు వెళ్ళాక అక్కడ జరిగే సంఘటనలతో పాటు ఇక్కడ సముద్రం ఒడ్డున వాళ్ళ కుటుంబాలు పడే కష్టాలను సమానతరంగా చూపించేలా ఒక పాటను కంపోజ్ చేశారు. సాయిపల్లవి తాను దూరంగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినదు నేనేం చేయాలలే పాయింట్ కూడా నాగచైతన్యతో చెప్పించారు.

ఇవన్నీ ఫైనల్ వెర్షన్ లో రాలేదు. అందులోనూ తండేల్ థీమ్ ని దాచుకున్న అసలైన సాంగ్ ఇలా ఎడిటింగ్ లో వెళ్లిపోవడం పట్ల ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే చందూ మొండేటి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ వద్దని చెప్పడం వల్లే ఆగిపోయామని, బన్నీ వాస్ తదితరులు ఏమైనా నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు కానీ ఓటిటిలోనూ ఇది జోడించే అవకాశం లేదన్నాడు. నిజానికి పాకిస్థాన్ ఎపిసోడ్స్ మీద కొంత మిశ్రమ స్పందన వచ్చిందనేది అందరికీ తెలిసిందే. అక్కడ మళ్ళీ ఇంకో పాట పెడితే నిడివి పెరిగి ల్యాగ్ అనిపించే ఫీలింగ్ కలిగే ఛాన్స్ ఉండటం వల్ల వద్దనుకుని ఉండొచ్చు.

సరే ఏదైతేనేం దాన్ని తర్వాత యూట్యూబ్ అయినా పెట్టే ఛాన్స్ ఉంది కాబాట్టి అలా అయినా చేయొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ ఆల్బమ్స్ లో ఈ సినిమా చోటు సంపాదించుకుంది. తండేల్ వంద కోట్ల గ్రాస్ సాధించాక మళ్ళీ స్పీడ్ చూపించలేదు. టీమ్ సైతం ప్రమోషన్లు ఆపేసింది. టార్గెట్ రీచ్ అయిపోవడంతో పాటు కొత్త రిలీజులు క్యూ కట్టడంతో పబ్లిసిటీకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదంతా ఎలా ఉన్నా నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన తండేల్ వచ్చే నెల ఓటిటిలో వచ్చాక మరింత భారీ స్పందన తెచ్చుకోవడం ఖాయం. అందులోనూ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అంటే ప్రమోషన్లు కూడా భారీగా ఉంటాయి.