ED వివాదంలో డైరెక్టర్ శంకర్ : ఏం జరిగిందంటే…

ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ ఏంథిరన్ (రోబో) గురించి అందరూ మర్చిపోయారనుకుంటున్న తరుణంలో దర్శకుడు శంకర్ మెడకు దానికి సంబంధించిన కేసు తాజాగా మెడకు చుట్టుకోవడం తీవ్ర సంచలనం రేపుతోంది. వివరాలేంటో చూద్దాం. ఆరూర్ తమిళనాథన్ అనే రచయిత 2011లో తన కథ జిగూబాని కాపీ కొట్టి రోబో తీశారని ఆరోపిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశాడు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణ చేపట్టింది. రచన, దర్శకత్వం చేపట్టినందుకు గాను శంకర్ కు 11 కోట్ల 50 లక్షల పారితోషికం అందినట్టు గుర్తించారు.

ఇన్వెస్టిగేషన్ లో బయట పడిన విషయాల ఆధారంగా 10 కోట్ల 11 లక్షలు విలువ కలిగిన శంకర్ మూడు స్థిరాస్తులను ఈడి తాజాగా అటాచ్ చేయడం చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది. కాపీ రైట్ యాక్ట్ 1957ని ఉల్లంఘిస్తూ శంకర్ చౌర్యానికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్ టిట్యూట్ అఫ్ ఇండియా (FTII) చేపట్టిన మరో విచారణలో ఏంథిరన్, జిగూబా మధ్య సారూప్యతలు ఉన్నాయని నిర్ధారించింది. దీంతో శంకర్ కు సంబంధించిన 11 కోట్ల విలువైన ఆస్తులకు అటాచ్ మెంట్ వచ్చింది. తదుపరి చర్యలు ఇంకా వెల్లడించలేదు.

అప్పట్లోనే రోబో 290 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం ట్రేడ్ వర్గాల్లో సంచలనం. అయితే శంకర్ ఒక్కడే కాపీలో భాగమయ్యాడా లేక అప్పటిదాకా ఆయన వెన్నంటే ఉండి తనదైన ముద్ర వేసిన దివంగత రచయిత సుజాత ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణం ఇంకా బయటికి రాలేదు. ఏడాది గ్యాప్ లో శంకర్ రెండు ప్యాన్ ఇండియా డిజాస్టర్లు చూశారు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రెండూ దారుణంగా పోయాయి. ఆ బాధలో ఉండగానే ఇప్పుడీ దశాబ్దంన్నర పాత కేసు షాక్ ఇవ్వడం ఊహించనిది. ఇంకా శంకర్ నుంచి స్పందన రాలేదు. వేల్పరి అనే మరో హిస్టారికల్ సినిమా తీసే పనిలో ఉన్న ఈ క్రియేటివ్ జీనియస్ వివాదం గురించి ఏమంటారో.