కంగనా.. పద్మశ్రీ వెనక్కివ్వు

Kangana
Kangana Ranaut

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి తర్వాత అత్యధికంగా చర్చనీయాంశం అయిన పేర్లలో ఒకటి రియా చక్రవర్తిది అయితే.. ఇంకొకటి కంగనా రనౌత్‌ది. రియా.. సుశాంత్‌కు గర్ల్ ఫ్రెండ్. పైగా అతడి మృతికి పరోక్షంగా కారణమైందని, తనకు డ్రగ్ రాకెట్‌తో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె పేరు అంత చర్చనీయాంశం కావడంలో ఆశ్చర్యం లేదు.

కానీ కంగనా రనౌత్‌ సుశాంత్ మృతి విషయంలో బాలీవుడ్ ప్రముఖులను ఎన్నేసి మాటలందో.. దీని మీద ఎంత గొడవ చేసిందో అందరికీ తెలిసిందే. సుశాంత్‌ది హత్య అంటే హత్య అని ఆమె వాదించింది. చాలామందికి దాంతో సంబంధముందని ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా సుశాంత్‌ది హత్య కాదు.. ఆత్మహత్య అని పోలీసుల విచారణలో నిర్ధారణ అయితే కేంద్ర ప్రభుత్వం తనకిచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా వెనక్కిచేస్తానని ఆమె శపథం చేసింది.

కాగా సుశాంత్‌ది ఆత్మహత్యే అని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారంటూ తాజాగా వార్తలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సుశాంత్ మద్దతుదారులు కోరుకున్నట్లే ఈ కేసును టేకప్ చేసిన సీబీఐ సైతం సుశాంత్‌ది ఆత్మహత్యే అని తేల్చిందన్నది మీడియాలో వస్తున్న తాజా సమాచారం. అనేక రకాలుగా విచారణ జరిపిన సీబీఐ అధికారులు.. సుశాంత్ మృతికి వేరే కారణాలేవీ కనిపించలేదని తేల్చినట్లు తెలుస్తోంది. దీంతో సుశాంత్ కేసు అతి త్వరలోనే మూత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి అతడిది ఆత్మహత్య కాదు, హత్య అని వాదించి.. చాలామంది మీద ఆరోపణలు చేసిన కంగనా ఇప్పుడేమంటుందన్నది ప్రశ్న. దీనిపై నెటిజన్లు ఊరుకోవట్లేదు. సుశాంత్‌ది ఆత్మహత్య అని తేలితే పద్మశ్రీ వెనక్కిస్తానన్న శపథాన్ని గుర్తు చేస్తున్నారు. కంగనా పద్మశ్రీని వెనక్కివ్వాలంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీనికామె ఎలా బదులిస్తుందో చూడాలి.