థియేటర్లలో సోసో….ఓటిటిలో అదరహో

ఈ మధ్య కాలంలో థియేటర్లలో ఎంత బాగా ఆడిన సినిమా అయినా సరే ఓటిటిలోకి వచ్చాక అదే స్థాయి స్పందన కనిపించడం లేదు. దానికి సవాలక్ష కారణాలున్నాయి. బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కల్కి లాంటివి చిన్న తెరపై ఆశించిన అనుభూతి ఇవ్వకపోవడం ఒకటైతే కొన్ని ఎంటర్ టైనర్లలో కామెడీ టీవీలో చూసినప్పుడు మాములుగా అనిపించడం మరో క్యాటగిరీ. కానీ సత్యం సుందరం కేసు వేరుగా కనిపిస్తోంది. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ డ్రామా రిలీజైన నెల రోజులకే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

దేవర ప్రభావం వల్ల సత్యం సుందరం తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన పెద్ద స్థాయిలో ఆడలేదు. మల్టీప్లెక్సుల్లో డిసెంట్ కలెక్షన్లు వచ్చాయి కానీ బిసి సెంటర్ల జనాలు పెద్దగా పట్టించుకోలేదు. రివ్యూలు చాలా పాజిటివ్ గా రావడం ఈ మధ్యకాలంలో దీనికే జరిగింది. నిడివి గురించి కొంత కంప్లయింట్ వచ్చాక ఓ ఇరవై నిముషాలు తగ్గించడం ప్లసయ్యింది. ఇప్పుడు వదలిన ఓటిటి వెర్షన్ కూడా ఎడిట్ చేసిందే. బావా అంటూ కార్తీ చేసే అల్లరి, ముభావంగా కనిపించినా లోపల ఎన్నో భావోద్వేగాలు అణుచుకున్న అరవింద్ స్వామి ఇద్దరి మధ్య కెమిస్ట్రీని తీర్చిదిద్దిన తీరు భారీ ఎత్తున వ్యూస్ తెచ్చి పెడుతోంది.

ట్విస్ట్ ఏంటంటే తమిళంలో కంటే ఎక్కువ తెలుగులోనే సత్యం సుందరంని డిజిటల్ లో చూస్తున్నారని ఓటిటి ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. థియేట్రికల్ గా కేరళ, కర్ణాటకలో సత్యం సుందరం ఫెయిల్యూర్ గా నిలవడం గమనార్హం. ఒక్కటి మాత్రం నిజం. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మరోసారి స్పష్టమయ్యింది. కేవలం గ్రాండియర్లే కాకుండా ఎమోషన్లు బలంగా ఉన్న సినిమాలను ఖచ్చితంగా ఆదరిస్తామని బలగం నుంచి సత్యం సుందరం దాకా ఎన్నోసార్లు ఋజువు చేశారు. ఈ లెక్కన త్వరలో శాటిలైట్ ఛానల్స్ లో వచ్చినప్పుడు పెద్ద ఎత్తున టిఆర్పి రావడం ఖాయంగా కనిపిస్తోంది..