రియా ఎవరు…..ఎక్కడ చూసిన ఈ గోలే

సరిగ్గా తగలాలే కానీ ఒక చిన్న వీడియో క్లిప్ సినిమాకు ఎంత పెద్ద ప్రమోషన్ తీసుకొస్తుందో సోషల్ మీడియా మరోసారి ఋజువు చేస్తోంది. రియా ఎవరు పేరుతో జరుగుతున్న ట్రెండింగ్ ఏకంగా సెలబ్రిటీలను అందులో భాగమయ్యేలా చేస్తోంది. తాజాగా నాగబాబు, నీహారిక సైతం ఇందులో పాల్గొనడంతో అభిమానులు షాక్ తిన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైన మత్తు వదలరా 2లో ఒక సన్నివేశం తాలూకు క్లిప్ ఇది. విలన్ అజయ్ ని కమెడియన్ సత్య రియా ఎవరు అని అడగటంతో మొదలయ్యే సంభాషణ చివరికి ఎటూ తేలకుండా హిలేరియస్ గా ముగుస్తుంది.

దీన్నే లెక్కలేనంత నెటిజెన్లు షేర్ చేసుకోవడంతో రీచ్ మిలియన్లలో వెళ్ళిపోతోంది. నిన్న పొట్టెల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అజయ్ మాట్లాడుతూ ఎవరెవరో రియా ఎవరూ అంటూ తనకు ఫోన్ చేస్తున్నారని, మీమ్స్ లో ఎవరూ పట్టించుకోనని తనకు దేవర, మత్తు వదలరా 2 తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదని సంతోషం వ్యక్తం చేశాడు. దీన్ని బట్టే ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డివివి ఎంటర్ టైన్మెంట్స్ అఫీషియల్ హ్యాండిల్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోని పెట్టి రియా ఎవరూ అంటూ ట్వీట్ చేయడం దాక వెళ్లిందంటే సత్య చేసిన అల్లరి అంతా ఇంతా కాదని అర్థమైపోతోందిగా.

ఇది ఇక్కడితో ఆగేలా లేదు. ఊహించని స్థాయిలో దక్కిన ఫ్రీ ప్రమోషన్ నెట్ ఫ్లిక్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. కోట్లు ఖర్చు పెట్టినా ఒక్కోసారి ఇంత పబ్లిసిటీ దక్కదు. అలాంటిది కేవలం రియా అనే పేరు మీద ఇంత ప్రచారం దక్కితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. రితేష్ రానా దర్శకత్వం వహించిన మత్తు వదలరా 2 థియేటర్లో డీసెంట్ సక్సెస్ అందుకోగా ఓటిటిలో మాత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. సత్యకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే డేట్లు అంత సులభంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉండగా ఇప్పుడు ఇంకో రెండేళ్ల దాకా ఖాళీ లేనంత రేంజ్ కు వెళ్ళిపోతున్నాడు.