ఇద్దరు మిత్రుల ఛలో రాయలసీమ

ఎన్నడూ లేనిది మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున ఒకే రోజు బాక్సాఫీస్ క్లాష్ పట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరూ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో తలపడాల్సి రావడంతో స్పోర్టివ్ గానే ఉన్నారు. పరస్పరం ఓపెనింగ్స్ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు కానీ బెల్లంకొండ గణేష్, మంచు విష్ణులే ధైర్యం చేయగా లేనిది ఈ సీనియర్లు మాత్రం ఎందుకు తగ్గాలనే ప్రశ్నలో లాజిక్ ఉంది. ప్రమోషన్ల వేగం మెల్లగా పెంచుతున్నారు. ది ఘోస్ట్ ఆల్రెడీ ట్రైలర్ తో పాటు ఒక లిరికల్ వీడియోని మార్కెట్ లో వదిలేసింది. కొత్త పోస్టర్లు కూడా వస్తున్నాయి.

కర్నూలులో ఘోస్ట్ టీమ్ ఈ 25న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకుని ఆ మేరకు అధికారికంగా ప్రకటించేసింది. సినిమా ఫంక్షన్లు ఎక్కువగా జరిగే ఎస్టిబిసి గ్రౌండ్స్ నే ఎంచుకున్నారు. కార్తికేయ 2, విరాట పర్వం, అఖండ తదితర వేడుకలు అక్కడే జరిగాయి. నాగ్ చాలా కాలం తర్వాత సీమకు వస్తుండటంతో ఏర్పాట్లలో ఫ్యాన్స్ బిజీగా ఉన్నారు. ఇక గాడ్ ఫాదర్ అనంతపూర్ లో 28న అక్కడి జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ముందస్తు విడుదల వేడుకను జరపబోతున్నట్టు ఆల్రెడీ ఇన్ఫో బయటికి వచ్చేసింది. అభిమనులు ఆ మేరకు అక్కడి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

ట్విస్ట్ ఏంటంటే రెండు ప్రాంతాలు రాయలసీమే. వీటి మధ్య దూరం జస్ట్ 150 కిలోమీటర్లు. మాస్ ప్రేక్షకులు సింహభాగం ఇక్కడ ఉన్నారు. కాకతాళీయంగా ప్లాన్ చేసుకున్నారో లేక ఎలాగూ కాంపిటీషన్ తప్పడం లేదు కాబట్టి ఇలా కూడా పోటీ పడదామని డిసైడ్ అయ్యారో తెలియదు కానీ మొత్తానికి ఈ పరిణామం ఆసక్తికరంగా ఉంది. మూడు రోజుల గ్యాప్ లో ఇవి జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఘోస్ట్ ఈవెంట్ రోజే గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రియల్ లైఫ్ స్నేహితులు ఇలా అన్ని విషయాల్లో భలేగా పోటీ పడుతున్నారు.