అనసూయ 50 పైసల కోసం రెండు బస్టాపులు నడిచి..

అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరు. నంబర్ వన్ యాంకర్ సుమకు దీటుగా పారితోషకం తీసుకుంటుంది అనసూయ. టీవీల్లో జబర్దస్త్ సహా పలు కార్యక్రమాల్లో ఆమె సందడి చేస్తుంటుంది. దీనికి తోడు సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలందుతున్నాయి. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న అనసూయ వార్షిక ఆదాయం కోట్లల్లో ఉంటుంది.

ఐతే ఇప్పుడీ స్థితిలో ఉన్న అనసూయ.. ఒకప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులే పడిందట. వారి కుటుంబం అద్దె పెంచినపుడల్లా ఆ భారం తట్టుకోలేక తక్కువ అద్దె ఉన్న ఇంటికి మారిపోవాల్సిన పరిస్థితి ఉండేదట. ముగ్గురు అమ్మాయిలున్న తమ కుటుంబాన్ని పోషించడానికి తన తల్లి ఇరుగు పొరుగు మహిళల చీరలకు పాల్స్ అవీ కుట్టేదట. ఇంకా అనేక రకాలుగా తాము ఇబ్బందులు పడ్డట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించిందామె.

హైదరాబాద్‌లో ఆర్డినరీ బస్సులతో పోలిస్తే మెట్రో బస్సుల్లో 50 పైసలు ఛార్జీ ఎక్కువుండేదని.. ఆ యాభై పైసలు మిగల్చడం కోసం తాను రెండు బస్టాపులు నడిచి వెళ్లేదాన్నని అనసూయ వెల్లడించింది. ఇక సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రను డబ్బు కోసం ఎంచుకున్నారా, పాత్ర నచ్చి చేశారా అని అడిగితే.. తనకు డబ్బులే కావాలనుకుంటే టీవీ ఫీల్డ్ కావాల్సినంత ఇస్తోందని.. పాత్ర నచ్చే ఆ సినిమా చేశానని అనసూయ వెల్లడించింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంటుందని అడిగితే.. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పాట కోసం తనను అడిగితే నో చెప్పిన విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించడం మొదలు ఇలాగే జరుగుతోందని ఆమె అంది. తన జీవితంలో ఎక్కువగా థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి అంటే.. అడివి శేషే అని చెప్పిన అనసూయ.. వార్నింగ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసేవాళ్లకు ఇస్తానని ఆమె అంది.