ఈ పని బాబు ఎప్పుడో చెయ్యాలి కదా

పెమ్మసాని చంద్రశేఖర్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న పేరు. గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ ఎన్నారై తన అఫిడవిట్లో రూ.5 వేల కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఆయన కంటే ఆస్తిపరులు ఎంతోమంది ఉండొచ్చు కానీ.. అదంతా బినామీల పేరిట, నల్లధనం రూపంలో ఉండొచ్చు. కానీ పెమ్మసాని మాత్రం యుఎస్‌లో వ్యాపారం చేసి సంపాదించిన ఆస్తులను అఫిడవిట్లో చూపించుకున్నారు.

ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెమ్మసాని చేస్తున్న ప్రసంగాలు, ఆయన కార్యకలాపాలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా ఆయన అమరావతి ప్రాంతంలో పర్యటించి.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఎక్కడికక్కడ ఆగిపోయాయో చూపించారు.

జగన్ సర్కారు కక్షగట్టి ఆపేసి నిరుపయోగంగా మార్చేసిన అనేక నిర్మాణాలను ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ వీడియో చూస్తే వైసీపీ వాళ్లు గ్రాఫిక్స్ అని, అవినీతి మయం అని చెప్పే చోట ఇన్ని నిర్మాణాలు జరిగాయా అని ఆశ్చర్యం కలగక మానదు. ఐతే నిన్నగాక మొన్న వచ్చిన పెమ్మసాని ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతిలో జగన్ సర్కారు చేసిన నిర్వాకాన్ని ఇలా కళ్లకు కట్టినట్లు చూపించి జనాల్లో కదలిక తెస్తుంటే.. ఐదేళ్లుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ కో ఇంత ఎఫెక్టివ్‌గా ఈ విషయాన్ని జనాల్లోకి ఎందుకు తీసుకెళ్లలేకపోయింది అన్నది ప్రశ్నార్థకం.

అమరావతి విషయంలో అనేక దుష్ప్రచారాలు చేసి బాబు మీద దాన్నొక మరకలా వేసేశారు వైసీపీ నేతలు. కొన్నేళ్ల ముందే చంద్రబాబు ఇదే తరహలో అమరావతిలో పర్యటించి జనాలకు తాను ఏ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానో చూపించి.. అమరావతిని జగన్ సర్కారు ఎలా నాశనం చేసిందో తెలియజెప్పాల్సింది. ఈ విషయంలో బాబు అండ్ కో ఫెయిరలయ్యార్నది వాస్తవం.