ర‌ఘురామ ఒంట‌ర‌య్యారు.. ఇప్పుడు ఏం చేస్తారు?

వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ఆ పార్టీకి ఇటీవ‌ల రిజైన్ కూడా చేసిన న‌ర‌సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు క‌నుమూరి రఘురామకృష్ణ రాజు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయ‌న‌కు టికెట్ వ‌స్తుంద‌ని.. పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని చెప్పుకొన్నా.. తీరా టికెట్‌ల కేటాయింపు అయిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న పేరు ఎక్కడా వినిపించ‌లేదు. జాబితాల్లో క‌నిపించ‌లేదు. ఆయ‌న‌కు పీక‌ల్లోతు అన్యాయం జ‌రిగింద‌నే వాద‌న న‌ర‌సాపురంలో వినిపిస్తోంది. అంతేకాదు.. ఆయ‌న ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా.. గెలిపిస్తామ‌నే టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే.. ఈ సాహ‌సం చేసేందుకు ర‌ఘురామ ఇష్ట‌ప‌డ‌డం లేదు. తాను ఓ పార్టీని(బీజేపీ లేదా టీడీపీ కావొచ్చు) న‌మ్మాన‌ని.. ఆ పార్టీ త‌న‌ను ముంచేసింద‌ని మాత్రం వ్యాఖ్యానిస్తున్నారు. ఇక‌, గ‌త నాలు గున్నరేళ్లుగా ఆయన సీఎం జగన్‌పై పోరాడారు. అంతేకాదు.. తాను ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని.. నర్సాపురం నుంచేనని చెబుతూ వస్తున్నారు. పొత్తులు ఉంటాయని.. ఏ పార్టీకి సీటు దక్కితే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు.

కానీ రాజకీయం ఎలా ఉంటుందో ఆయనకు ఇప్పుడు అర్థమైపోయింది. బీజేపీ నుంచి టిక్కెట్ దక్కలేదు. బీజేపీ విషయంలో ఆయనకు ఇదే మొదటి ఎక్స్ పీరియన్స్ కాదు. 2014లోనూ అంతే. తనకే టిక్కెట్ వస్తుందని అనుకుంటే.. గోకరాజు గంగరాజుకు ఆరెస్సెస్ మద్దతుతో టిక్కెట్ దక్కించుకున్నారు. అప్పుడు ఆయన ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మరి ఈ సారి కూడా ఆయన ఎన్నికకు దూరమవుతారా? అనేది ప్ర‌శ్న‌. ఇక‌, 2019లో టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. కానీ, ఆ పార్టీ కూడా టికెట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ పిల్ల‌నిచ్చిన‌ట్టు.. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చారు.

అయితే.. రాజ‌కీయ ఆధిప‌త్యం కోస‌మో.. నియోజ‌క‌వ‌ర్గంలో మార్పులో తెలియ‌దు కానీ.. అన‌తి కాలంలోనే ఆయ‌న యాంటీ జ‌గ‌న్ అజెండాతో ముందుకు సాగారు. సీఎం జగన్‌పై ఒంటి కాలిపై లేచారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. అలాంటి నాయ‌కుడికి టీడీపీ నుంచి కానీ బిజెపీ నుంచి కానీ  టికెట్ ద‌క్క‌లేదు. ఆ షాక్‌ నుంచి ఆయన ఇంకా తేరుకోలేకపోతున్నారు. నరసాపురం పార్లమెంట్‌ టెకెట్‌ను బిజెపీ సీనియ‌ర్ నాయ‌కుడు, 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేటాయించింది.

ఈ నేప‌థ్యంలో రఘురామకృష్ణంరాజు రాజకీయ ప్రయాణం ఎటువైపు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.  జగన్ ను వ్యతిరేకించే వర్గాల్లో రఘురామకు ప్రత్యేకమైన అభిమ‌నులు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఒంట‌రిగా పోటీ చేస్తారా?  లేక ఇత‌ర పార్టీల‌వైపు మొగ్గు చూపుతారా? అనేది ఆస‌క్తిగా మారింది. చూడాలి ఆయ‌న ఏం చేస్తారో!!