జగన్ మాదిరిగా రూ.10 ఇచ్చి రూ.100 లాగడం మేం చేయం

వైసీపీ పాల‌న‌లో రాష్ట్రంలో చీక‌టి వ్యాపారాలు పుంజుకున్నాయ‌ని, దీనిలో భాగంగానే రాష్ట్రానికి డ్ర‌గ్స్ వ‌స్తున్నాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ‘డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వైసీపీ నాయ‌కులు వచ్చారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రాష్ట్రంలోకి రావడానికే భయపడ్డారు. అలాంటిది ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా.?’ అంటూ నిలదీశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తామని చంద్రబాబు అన్నారు. దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు.

రాష్ట్రంలోని ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ టీడీపీ అని తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ‘తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి మరీ కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళల్లో చైతన్యం తీసుకొచ్చాం. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వాలని ఆలోచన చేసిందే టీడీపీ. 2 కోట్ల మంది మహిళలకు హామీ ఇస్తున్నా. మహిళల ఆదాయం రెట్టింపు చేస్తాం“ అని తెలిపారు.

ఇదేస‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. “జగన్ మాదిరిగా రూ.10 ఇచ్చి రూ.100 లాగడం మేం చేయం. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతాం. అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అకౌంట్ లో వేస్తాం’ అని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా పైకి రావాలంటే ఇంటికి 2 ఆవులు ఇవ్వాలనుకున్నామని.. అప్పుడు దీనిపై అవహేళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పంలో వెయ్యి లీటర్లతో ప్రారంభమైన పాల సేకరణ.. ఇప్పుడు 4 లక్షల లీటర్లకు చేరుకుందన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ఇంటింటికీ మరుగుదొడ్లు కట్టించామని అన్నారు.

రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలను వైసీపీ ప్రభుత్వం తెంచేస్తోందని విమర్శించారు. జగన్ పాలనలో రూ.60 మద్యం ధర రూ.200 అయ్యిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది కౌరవ సభ అని.. దానిని గౌరవ సభ చేశాకే మళ్లీ అక్కడ అడుగు పెడతామని అన్నారు. వైసీపీకీ ఓటు వేయాలని అడిగిన వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.