“నాకు-డ్ర‌గ్స్ కు లింకా.. 20 కోట్లు ప‌రిహారం క‌ట్టండి”

విశాఖ తీరానికి బ్రెజిల్ నుంచి వ‌చ్చిన కంటెయిన‌ర్ల‌లో మాద‌క ద్ర‌వ్యాలు వెలుగు చూడ‌డం రాజ‌కీయంగా రాష్ట్రాన్ని కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు ఒక‌పార్టీపై మ‌రో పార్టీ నిప్పులు చెరుగుకున్నాయి. ఇంత‌లోనే ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఈ కుంప‌టిలోకి బీజేపీని లాగేశారు. బీజేపీ హ‌స్తం లేకుండా.. ఇది జ‌రుగుతుందా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి కుటుంబం పాత్ర‌ను కూడా లాగేశారు.

ఈ విష‌యాలను వైసీపీ అధికార మీడియా సాక్షిలో ప‌దే ప‌దే ప్ర‌చారం చేశారు. అంతేకాదు.. ప్ర‌త్యేక క‌థ‌నాలు కూడా అల్లారు. మొత్తంగా ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. ఎన్నిక‌ల‌కు ముందు పురందేశ్వ‌రికి ఇబ్బందిగా మార‌డంతో ఆమె ఫైర్ అయ్యారు. అంతేకాదు.. త‌న ప‌రువుకు భంగం క‌లిగించారంటూ.. సాక్షి యాజ‌మాన్యానికి(సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి డైరెక్ట‌ర్‌) పురందేశ్వ‌రి తాజాగా నోటీసులు పంపించారు.

సంధ్యా ఎక్స్ పోర్ట్స్ సంస్థలో తాము భాగస్వాములమంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ సాక్షి మీడియాపై మండిపడ్డారు. ఈ క్రమంలో, తన పరువుకు భంగం కలిగించారంటూ పురందేశ్వరి తన సాక్షి మీడియాకు పరువునష్టం నోటీసులు పంపించారు. రూ.20 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్టు తెలిపారు. ఆధార రహిత వార్తలు ప్రచారం చేస్తూ పరువునష్టం కలిగిస్తున్నారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురందేశ్వరి న్యాయవాది సతీశ్ ఈ మేరకు సాక్షి యాజమాన్యానికి నోటీసులు పంపారు.

విశాఖ తీరానికి ఇటీవల బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ రాగా, అందులో 25 వేల కిలోల కొకైన్‌ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ డ్రగ్స్ తెప్పించిన కంపెనీ మీ వాళ్లదేనంటే మీ వాళ్ల‌దేనంటూ.. ఏపీలోని అధికార‌, ప్రతిప‌క్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.