టైసన్ నాయుడు ఆలస్యానికి కారణమేంటి

తెలుగులో మాస్ మార్కెట్ క్రమంగా పెరుగుతున్న టైంలో హిందీలో పేరు తెచ్చుకుందామని అనవసరంగా ఛత్రపతి రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు తెలుగు ఆఫర్ల మీద సీరియస్ గా దృష్టి పెట్టాడు. కొత్తగా కమిటయినవి కాసేపు పక్కన పెడితే రెండేళ్ల క్రితం మొదలైన టైసన్ నాయుడు ఆగుతూ సాగుతూ ఎప్పుడు పూర్తవుతుందో అంతు చిక్కని పరిస్థితి కొని తెచ్చుకుందని ఇన్ సైడ్ టాక్. 14 రీల్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ టీజర్ మూడు నెలల క్రితం రిలీజ్ చేస్తే ఆరు మిలియన్లకు దగ్గరలో వ్యూస్ తో బాగానే రీచ్ తెచ్చుకుంది.

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తర్వాత దర్శకుడు సాగర్ కె చంద్ర చేస్తున్న సినిమా ఇదే. నెలలు గడుస్తున్నా పూర్తి చేయడంలో ఎందుకు ఆలస్యమవుతోందో అంతు చిక్కడం లేదు. బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయని, ఆ కారణం వల్లే ఇదే 14 రీల్స్ బాలకృష్ణ – బోయపాటి కాంబోలో ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టు లేటవుతోందనే ప్రచారం లేకపోలేదు. దానికి బలం చేకూర్చేలా ఉగాది నాడు ప్రారంభం కావాల్సిన మూవీ ఇప్పటిదాకా సెట్స్ కు వెళ్ళలేదు. ఎన్నికల ప్రచారం వల్ల బాలయ్య బిజీగా ఉన్నా ఒక్క రోజు పూజా కార్యక్రమాలకు అదేమీ పెద్ద ఇబ్బంది కాదు. ఇంకేదో ఉందనేది ఇండస్ట్రీ వర్గాల గుసగస.

ఇవన్నీ ఎలా ఉన్నా సాయిశ్రీనివాస్ స్పీడ్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఫామ్ లో ఉండి గ్యాప్ తీసుకుంటే ఏదో అనుకోవచ్చు. కానీ ఇతని గత సినిమా అల్లుడు అదుర్స్ డిజాస్టర్. అంతకు ముందు ట్రాక్ రికార్డులోనూ రాక్షసుడు మాత్రమే విజయం సాధించింది. అది కూడా తమిళ రీమేక్. సో వీలైనంత త్వరగా స్ట్రెయిట్ హిట్టు కొడితే మళ్ళీ కంబ్యాక్ అవ్వొచ్చు. అటుపక్క తమ్మడు గణేష్ కూడా కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. తొలి రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కథల ఎంపికలో బ్రదర్స్ ప్లానింగ్ తేడా కొడుతోంది. నిన్న సాయిశ్రీనివాస్ కొత్త అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.