జగన్ మళ్ళీ CM అంటున్న ఈ ‘రెడ్డీ హీరో

విశాల్ ఆలియాస్ విశాల్ కృష్ణారెడ్డి. నటుడు, నిర్మాత అయిన విశాల్ తెలుగు వాడు అయినప్పటికీ చెన్నైలోనే స్థిరపడి తమిళ సినిమారంగంలో రాణించి వెలుగులోకి వచ్చాడు. అక్కడ విజయవంతం అయిన తరువాత తెలుగులో డబ్బింగ్ అయిన పందెం కోడి సినిమాతో ఇక్కడ అరంగేట్రం చేశాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2005లో లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో పాటు ఈ సినిమాలో పాత్ర పేరు వైఎస్ తండ్రి వైఎస్ రాజారెడ్డి, ఆయన కుమారుడుగా విశాల్ నటించాడు. విజయవంతమైన ఈ సినిమాకు సీక్వెల్ గా పందెంకోడి 2 కూడా వచ్చింది.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో తిరిగి మరోసారి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విశాల్ వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. జగన్ పై దాడి ఘటన మీద స్పందించిన విశాల్ రాజకీయాల్లో ఇలాంటివి సహజం అని, తాను వైసీపీ మద్దతుదారుడిని కాదని, జగన్ అభిమానినని స్పష్టం చేశాడు. గత ఎన్నికలకు ముందే తాను జగన్ సీఎం అవుతాడని చెప్పానని, ఈ సారి కూడా అదే చెబుతున్నానని చెప్పడం విశేషం. సినిమాల్లో కోట్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికి పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి కష్టపడుతున్నాడని అన్నాడు.

2026లో తాను కూడా పార్టీ పెడతానని చెబుతున్న విశాల్ ఇప్పటికే దేవీ ఫౌండేషన్ స్థాపించి విద్యార్థులను చదివిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాడు. ఈ కాలంలో కూడా మంచినీళ్ల కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడం చూస్తే కోపం వస్తుందని, ఎన్జీఓలుగా ఉండి ఎంత చేసినా అధికారంలో ఉండి పనిచేస్తేనే ఈ సమాజం మారుతుందని, అందుకే కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నానని విశాల్ అన్నాడు.