నిజమా.. సిద్ధు పెళ్లయిపోయిందా?

త‌మిళ క‌థానాయ‌కుడు సిద్ధార్థ్, హైద‌రాబాద్ మూలాలున్న బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైద‌రీ కొన్నేళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ‘వంశీ’ అనే డిజాస్టర్ మూవీ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌లను ఒక్కటి చేసినట్లే ‘మహాసముద్రం’ అనే అట్టర్ ఫ్లాప్ మూవీ ఈ జంట ప్రేమకు బీజం వేసింది. ముందు వీళ్లిద్దరూ జస్ట్ స్నేహితులే అనుకున్నారు.

కానీ తర్వాత కూడా తరచూ కలవడం, మీడియా కంట్లో పడడంతో వ్యవహారం వేరని అర్థమైంది. ఏడాది కిందట్నుంచే ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరి ఫొటోలు ఎప్పుడు సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చినా వైర‌ల్ అవుతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైందట. వీరి వివాహానికి తెలుగు గడ్డ వేదికైనట్లుగా వార్తలు వస్తుండడం విశేషం.

తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో రంగనాయకస్వామి ఆలయంలో వీళ్లిద్దరూ ఏ హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఏ ఆడంబరం లేకుండా సింపుల్‌గా పెళ్లి జరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత నివాసమైన చెన్నై కాకుండా తెలంగాణకు వచ్చి ఈ జంట పెళ్లి చేసుకోవడం విశేషమే.

సిద్ధుకు చాలా ఏళ్ల కిందటే పెళ్లయింది. తర్వాత అతను విడాకులు తీసుకున్నాడు. కొంత కాలం సమంతతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. తర్వాత ఒంటరిగానే చాలా ఏళ్లు గడిపాడు. అదితికి కూడా గతంతోనే పెళ్లయింది. ఆమె కూడా విడాకులు తీసుకుంది. ఇప్పుడీ జంట కొత్త ప్రయాణానికి సిద్ధమైంది. మరి ఈ పెళ్లి వార్త నిజమే అయితే.. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోవాలని ఆశిద్దాం.